ఖలీల్వాడి, మే 7: మాదిగలను రాజకీయ లబ్ధికోసం వాడుకొంటూ, ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. శనివారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. దళిత అణగారిన వర్గాలు విద్య, ఉపాధి, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధికి నోచుకోకుండా బీజేపీ అణచివేస్తున్నదని ఆరోపించారు. అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాయమాటలు చెప్పిన బీజేపీ.. మాదిగ, మాదిగ ఉపకులాల వారిని కేవలం ఓటు బ్యాంకుగా వాడుకొన్నదని మండిపడ్డారు. నరేంద్రమోదీ, అమిత్షా మాదిగ జాతిని వంచిస్తున్నారని పునరుద్ఘాటించారు. పార్లమెంట్లో స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ వర్గీకరణ అంశాన్ని బీజేపీ ప్రభుత్వం దాట వేస్తున్నదని విమర్శించారు. జాతి గొంతు కోసిన జాతీయ పార్టీలను అడుగడుగునా అడ్డుకుంటామని స్పష్టంచేశారు.