Yadadri | యాదగిరీశుడి నిత్య తిరుకల్యాణోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ వెలుపలి ప్రాకార మండపంలో సుదర్శన నారసింహ హోమం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లకు గజ వాహనంపై వేంచేపు చేసి కల్యాణోత్సవ సేవను నిర్వహించారు. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లను నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా సాగింది. గంటన్నరపాటు సాగిన కల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వయంభూ నారసింహుడికి నిత్యోత్సవాలను అర్చకులు తెల్లవారుజాము నుంచే ప్రారంభించారు. స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధనలు, నిజాభిషేకం జరిపిన అర్చకులు తులసీ సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన, ఆంజనేయ స్వామికి సహస్రనామార్చన జరిపారు. సాయంత్రం స్వామివారిని గరుఢవాహనం, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేపు చేసి సేవను కొనసాగించారు.
దర్బార్సేవలో భాగంగా ప్రధానాలయ ముఖ మండపంలో స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి వేంచేపు చేశారు. స్వామివారికి నాలుగు వేదాల పారాయణం చేసి, స్వస్తి, మంత్రార్థ వంటి మంత్రాలతో శాంతిపజేశారు. అనంతరం స్వామివారిని గర్భాలయానికి వేంచేపు చేశారు. ముఖమండపంలో సువర్ణమూర్తులకు బంగారు పుష్పార్చనలు నిర్వహించారు. ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన గావించారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు దఫాలుగా జరిగిన సువర్ణ పుష్పార్చనలో భక్తులు పాల్గొని తరించారు. పాతగుట్ట ఆలయంలో స్వామివారి నిత్యోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దర్శనాలు కొనసాగాయి. సుమారు 13వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీవారి ఖజానాకు రూ. 19,49,503 నిత్యాదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్.గీత వెల్లడించారు.