Yadadri | సాక్షాత్ బ్రహ్మ నిర్ణయించిన సుముహూర్తాన.. వేద మంత్రోచ్ఛారణలతో మంగళ వాయిద్యాలు, కర్పూర కాంతుల నడుమ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ వేడుకలు అంబరాన్ని తాకాయి. సర్వ జగత్తుకూ కల్పవల్లి, పుణ్యాలరాశి అమ్మవారికి మాంగళ్యధారణ మహోన్నతంగా జరిగింది. దిక్కులు పిక్కటిల్లేలా ఓం నమో నారసింహాయ నామస్మరణలు మిన్నంటిన శుభవేళ.. స్వామివారి కరుణాకటాక్ష వీక్షణాలకై భక్తజనం పోటెత్తిన సమయాన.. జగత్ కల్యాణం అందరినీ ఆనందపారవశ్యంలో ముంచెత్తింది.
ఈ అపూర్వ ఘట్టం భక్త హృదయాల్లో ఆధ్యాత్మిక వైభవాన్ని నింపింది. యాదగిరిగుట్ట పులకించింది. స్వర్ణాభరణాలతో అలంకరించిన ఉత్సవ మూర్తులను వేదిక వద్ద కొలువుదీర్చింది మొదలు జరిగిన ప్రతి ఘట్టం పరమార్థంతో నిండి మనోహరంగా అలరించింది. ప్రధానాలయ పునఃప్రారంభం అనంతరం జరుగుతున్న యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష్మీనరసింహస్వామి వారి పరిణయోత్సవం కనుల పండువగా సాగింది. కొండపైన తూర్పు మాఢ వీధుల్లో ఆగ్నేయంలోని బ్రహ్మోత్సవ మండపంపై కల్యాణ ఘట్టాన్ని రాత్రి ఘనంగా నిర్వహించారు.
మొదటగా ప్రధానాలయలో రాత్రి 8:25 గంటలకు గజ వాహన సేవపై స్వామివారు పెళ్లి కొడుకుగా ముస్తాబై మాఢ వీధుల్లో ఊరేగుతూ మండపానికి చేరుకున్నారు. ఆగమశాస్త్రం ప్రకారం స్వామివారి కల్యాణ వేడుకలను మండపంలో స్వామివారు పడమటి వైపు, అమ్మవారిని తూర్పు వైపు సేవలో అధిష్ఠింపజేసి వేడుకలు నిర్వహించారు. విశ్వక్సేనుడి తొలి పూజలతో ప్రారంభమై.. స్వామికి యజ్ఞోపవీతధారణ జరిపి పాదప్రక్షాళన గావించారు. స్వామి, అమ్మవార్లను జీలకర్ర బెల్లంతో అలంకరించి మాంగళ్య పూజ తంతు నిర్వహించారు. బ్రహ్మ ముహూర్తంలో నారసింహుడు మహాలక్ష్మి అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. ఆ తర్వాత భక్తులు దర్శించుకునే విధంగా కల్యాణ మూర్తులను ఉత్తర దిశలో అధిష్ఠింపజేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారు శ్రీరాముడిగా భక్తులకు దర్శనమిచ్చి, హనుమంత వాహనంలో విహరించారు.
స్వామి, అమ్మవార్ల కల్యాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వం తరఫున పట్టు వస్ర్తాలు సమర్పించారు. సీఎం కేసీఆర్ సతీమణి శోభ తమ కుటుంబం తరఫున పట్టు వస్త్రాలు, పండ్లు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి దంపతులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్పర్సన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఈఓ గీత తదితర ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారు లక్ష్మీదేవిని పరిణయమాడిన ఘట్టాన్ని తిలకించడానికి వచ్చిన అశేష భక్తజనంతో యాదాద్రి కొండ కిక్కిరిసింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.