బెజ్జూర్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్, కర్జెల్లి రేంజ్ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు వెళ్లిపోయినట్లు అధికారులు నిర్ధారించారు. రెండు రోజులుగా స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ పులి జాడ కోసం సోమవారం నుంచి అటవీ అధికారులు, ఎనిమల్ ట్రాకర్స్ వెతుకుతున్నారు. కుకుడా గ్రామంలో సోమవారం పశువుపై దాడి చేసిన అనంతరం పులి కర్జెల్లి రేంజ్ అటవీ ప్రాంతం వైపు వెళ్లినట్లు అటవీ అధికారులు గుర్తించారు. మంగళవారం ఉదయం ప్రాణహిత నది దాటి మహారాష్ట్రకు వెళ్లినట్లు నిర్ధారించారు. బెజ్జూర్ రేంజ్ అధికారి దయాకర్ మాట్లాడుతూ.. పులి మహారాష్ట్రకు వెళ్లినా, అటవీ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తిరిగి మళ్లీ వచ్చే అవకాశమున్నదని పేర్కొన్నారు.