నాగర్ కర్నూల్ : నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులి గర్జిస్తూ పర్యాటకులకు కనువిందు చేసింది. ఆదివారం హైదరాబాద్కు చెందిన పర్యాటకులు సఫారీలో ఫరహాబాద్ వైపు అటవీ ప్రాంతంలో వెళ్లగా.. అక్కడ రోడ్డు దాటుతూ పెద్దపులి కనిపించింది. వెంటనే అటవీశాఖ సిబ్బంది సఫారీని నిలిపివేశారు. పులి అరగంట పాటు రోడ్డు పక్కనే ఉండి.. తర్వాత అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయిందని పర్యాటకులు తెలిపారని ఎఫ్డీవో రోహిత్ తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు పర్యాటకులు పులి సంచారానికి సంబంధించిన దృశ్యాలను కెమెరాల్లో బంధించారు. పులిని దగ్గరా చూశామంటూ ఆనందం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్డీవో ఆదివారం రాత్రి పహరాబాద్ వైపు వెళ్లగా తాను సైతం అట్టి పెద్దపులిని చూసినట్లు ఎప్డీవో పేర్కొన్నారు. గతంలోకన్నా ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులులు, వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగిందని డీఎఫ్వో కృష్ణగౌడ్ తెలిపారు.