కొల్లాపూర్, మార్చి 23 : ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణలోకి తల్లి పులి వచ్చింది. నం ద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం ప్రాంతంలో చెట్లపొదల్లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి 6వ తేదీన కృష్ణానది దాటి తెలంగాణలోని కొల్లాపూర్ సమీపంలో ఉన్న నల్లమల అడవులకు చేరిందన్న అనుమానాలను స్థానిక అటవీ అధికారులు వ్యక్తం చేశారు.
కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని సులాలకుంట అడవిలో ఫారెస్ట్ అధికారులు అమర్చిన సీసీ కెమెరాలో ఓ ఆడ పులి ట్రాప్ అయినట్టు రెండ్రోజుల కిందట అధికారులు గుర్తించారు. ఆంధ్రా నుంచి వచ్చిన పులేనా? లేక వేరేదా? అన్న విషయాన్ని అధికారులు స్పష్టం చేయలేదు. అయితే పులిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. వేసవి కావడంతో కృష్ణానదిలో నీటిమట్టం తగ్గింది. నదిని దాటి పులి వచ్చే అవకాశమే లేదని అధికారులు చెప్తున్నారు. అయితే అధికారులు నిఘా పెంచడంతో రెండ్రోజుల కిందట సులాలకుంట ప్రాంతంలో ఆడ పులి సంచరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఈ విషయమై ఇరు ప్రాంతాల అటవీ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.