హుజూరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో రాజకీయంగా ప్రాధాన్యం కలిగిన హుజూరాబాద్ ఉపఎన్నికపై కాంగ్రెస్ పూర్తిగా చేతులెత్తేసినట్టు కనిపిస్తున్నది. బీజేపీతో ఒప్పందం చేసుకున్న పీసీసీ చీఫ్ సొంతపార్టీని హుజూరాబాద్లో నామరూపాలు లేకుండా చేస్తున్నారని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. హుజూరాబాద్తో ఎ లాంటి సంబంధంలేని వ్యక్తికి ఇక్కడ కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇచ్చేలా పీసీసీ అధ్యక్షుడు వ్యవహారం నడిపారని మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నా కాంగ్రెస్ తరఫున కనీసపాత్ర లేకుండా పోయిందని వాపోతున్నారు. కాంగ్రెస్ ఖరారు చేసిన అభ్యర్థి బల్మూ రి వెంకట్ ఇప్పటికీ నియోజకవర్గం వైపు రాలేదు. ఎప్పుడు వచ్చేది హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎవరికీ తెలియడంలేదు. సొంతపార్టీలోనే పోటీపై స్పష్టత లేకపోవడం తో టికెట్ ఆశించిన పలువురు తామే పోటీకి దిగుతున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ తరఫున ఒంటెల లింగారెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. నామినేషన్ దాఖలుకు మరో రెండురోజులు గడువున్న నేపథ్యంలో మరికొందరు కాంగ్రెస్ తరుపున పోటీలో నిలిచేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అసలు అభ్యర్థి ఎప్పుడు వస్తారనేది మాత్రం ఎవరికీ తెలియడంలేదు. మొన్నటివరకు హుజూరాబాద్లోని పార్టీ కార్యాలయం కూడా తెరుచుకోలేదు. టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న 18 మంది లో ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీలో పనిచేసినవారికి గుర్తింపు దక్కినట్టు ఉండేదని, కీలకమైన ఎన్నికలలో పార్టీని భ్రష్టు పట్టించేలా పీసీసీ చేస్తున్న వ్యవహారంపై తాడోపేడో తేల్చుకుంటామని ఆశావహులు చెప్తున్నారు. హుజూరాబాద్, జమ్మికుంటకు చెందిన పలువురు రెండురోజుల్లో రాజకీయంగా సొంత నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. పీసీసీకి కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న క్యాడర్ను ఆగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.