హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న మోదీ సర్కారు.. ఉన్న ఆదాయానికి గండి కొడుతున్నది. నోటికాడి ముద్ద లాగేసినట్టు రైతులకు లాభాలు వచ్చే సమయంలో బియ్యం ఎగుమతులపై పన్ను విధించడంతోపాటు నూకల ఎగుమతిపై నిషేధం విధిస్తూ అనాలోచిత నిర్ణయం తీసుకొన్నది. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయంతో తెలంగాణ రాష్ర్టానికి, రాష్ట్ర రైతాంగానికి తీరని నష్టం జరుగనున్నది. ప్రస్తుతం మార్కెట్లో ధాన్యం మంచి ధర పలుకుతున్నది. మొన్నటి వరకు ఎగుమతులకు సంబంధించి క్వింటాల్కు ధర రూ.2,500 వరకు ఉండగా, ప్రస్తుతం అది రూ.3 వేలకు పైగా పలుకుతున్నది. రెండు మూడు నెలల్లో ఇది రూ.3,500కు పెరిగే అవకాశం ఉన్నదని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతం ధాన్యం క్వింటాలుకు మద్దతు ధర రూ. 2,040గా ఉన్నది. దీనితో పోల్చితే ఎగుమతులకు డిమాండ్ ఉంటే రైతుకు రూ. 2500-2700 వరకు ధర దక్కుతుంది. అంటే ఒక్కో క్వింటాలుపై రైతులకు రూ.500-700 వరకు లాభం వస్తుంది. కానీ, కేంద్రం నిర్ణయంతో రైతులకు క్వింటాలుపై ఆ మేరకు నష్టం వచ్చే అవకాశం ఉన్నదని అంచనా.
తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రం సవాలక్ష షరతులు విధిస్తున్నది. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేయబోమని గతంలోనే తేల్చి చెప్పింది. మరోవైపు కొనుగోలుకు ముందుకొచ్చే ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లను కూడా దూరం చేస్తున్నది. ఖరీఫ్లో ధాన్యం కొనుగోలులో ప్రైవేటు వ్యాపారులు, మిల్లర్లది కీలక పాత్ర. ప్రతి సీజన్లో కనీసం 25-30 లక్షల టన్నుల ధాన్యాన్ని వీరు కొనుగోలు చేస్తారు. దీంతో రైతులకు మద్దతు ధర కన్నా ఎక్కువ ధర దక్కుతుంది. ముఖ్యంగా సన్నాల విషయంలో వీరిది కీలక పాత్ర. కేంద్ర ప్రభుత్వం సన్నాలకు, దొడ్డు రకానికి ఒకటే ధరను ఇస్తుంది. సాధారణ రకం క్వింటాలుకు రూ. 2,040, గ్రేడ్-ఏ రకానికి రూ. 2,060గా నిర్ణయించింది. కానీ మెజారిటీ ధాన్యానికి సాధారణ రకం ధరనే వర్తిస్తుంది. ఈ సీజన్లో తెలంగాణలో సుమారు 63 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో భారీ స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉన్నది. ఇందులో సన్నరకం ధాన్యం భారీగా ఉంటుంది. ఈ సన్నాలను ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తేనే రైతులకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది.
బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై 20 శాతం పన్ను విధించడం, నూకల ఎగుమతిపై పూర్తి నిషేధం విధించటం పూర్తిగా అసంబద్ధమైన చర్య అని దక్షిణ భారత రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తూడి దేవేందర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ కేంద్రం నిర్ణయాలు దక్షిణాది రాష్ర్టాల రైతులకు.. ముఖ్యంగా తెలంగాణ రైతులకు, తెలంగాణ ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తాయని అన్నారు. నెల రోజుల్లో ధాన్యం చేతికొచ్చే సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం దారుణమని విమర్శించారు. వరి సాగు చేయొద్దన్న కేంద్రం, ఇప్పుడు నిల్వలు తగ్గాయని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. పంజాబ్, హర్యానాలో పండించే బాస్మతి బియ్యం ఎగుమతిపై పన్నులు లేనప్పుడు.. దక్షిణాది రాష్ర్టాల్లో పండించే బియ్యంపై పన్నులు విధించడం ఏంటని ప్రశ్నించారు. బాస్మతి బియ్యానికి జీఐ గుర్తింపు ఇచ్చినట్టుగానే తెలంగాణలో పండించే సోనామసూరి రకాలైన హెచ్ఎంటీ, ఆర్ఎన్ఆర్, బీపీటీ బియ్యానికి కూడా జీఐ గుర్తింపు ఇచ్చి ఎగుమతులకు ఆటంకం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. గతంతో పోల్చితే ఈ సీజన్లో 5 శాతం వరి విస్తీర్ణం మాత్రమే తగ్గిందని, దీనికే కేంద్రం ఇన్ని ఆంక్షలు పెట్టడం విడ్డూరంగా ఉన్నదని ధ్వజమెత్తారు. కేంద్రం ఈ రెండు నిర్ణయాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీ సర్కారుకు దక్షిణాది రైతులపై వివక్ష.. ఉత్తరాది రైతులపై గల ప్రేమ మరోసారి బయటపడింది. పంజాబ్, హర్యానాలో ఉత్పత్తి అయ్యే బాస్మతి బియ్యం ఎగుమతులపై ఎలాంటి పన్నులు లేవు. కానీ దక్షిణాది రాష్ర్టాల్లో ముఖ్యంగా తెలంగాణలో ఉత్పత్తి అయ్యే సన్నాలపై పన్నులు విధించింది. అదికూడా ఏకంగా 20 శాతం పన్ను విధించడం గమనార్హం. దీనికి తోడు తెలంగాణలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యే నూకల ఎగుమతిని కేంద్రం పూర్తిగా నిషేదించడం వారి కక్షకు నిదర్శనమనే విమర్శలు వినిపిస్తున్నాయి.