మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మార్చి 19: మహబూబ్నగర్ జిల్లా పొన్నకల్లో గతనెల అర్ధరాత్రి వీధి కుక్కలను గన్తో కాల్చి చంపిన కేసును ఛేదించినట్టు ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. ఓ పెంపుడు కుక్కను కరిచి హతమార్చడమే కాకుండా మరో పెంపుడు కుక్కను కరిచి గాయాల పాలుచేయడంతో కోపంతో 25 వీధి కుక్కలను రైఫిల్తో మంద నర్సింహారెడ్డి కాల్చి చంపినట్టు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం మహబూబ్నగర్లో కేసు వివరాలను మీడియాకు తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఫరూఖ్నగర్ మండలం దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని చించోడ్కు చెందిన మందా నర్సింహారెడ్డి హైదరాబాద్లోని లక్డీకాపూల్లో ఉంటున్నాడు. ఫిబ్రవరి 15 న అత్తగారి ఊరైన అడ్డాకుల మండలం పొన్నకల్కు కుటుంబ సభ్యులతోపాటు పెంపుడు కుక్కలతో వచ్చాడు. గ్రామంలోని వీధి కుక్కలు ఇతని పెంపుడు కుక్కను చంపగా మరో కుక్కను గాయపరిచాయి. ఫలక్నుమాకు చెందిన తారీఖ్ హైమద్, మహ్మద్ తాహేతో కలిసి నర్సింహారెడ్డి గత నెల 16న అర్ధరాత్రి దాటిన తరువాత తన బెంజ్ కారులో తిరుగుతూ.. లైసెన్స్డ్ వెపన్ 22 రైఫిల్తో గ్రామంలో కనిపించిన 25 కుక్కలను కాల్చారు. వీటిలో 20 శునకాలు చనిపోగా.. మరో ఐదు గాయపడ్డాయి. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి నర్సింహారెడ్డితోపాటు తారీఖ్ హైమద్, మహ్మద్ తాహేర్లపై మూగజీవుల సంరక్షణ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి మంగళవారం అరెస్టు చేశారు. వీరి నుంచి రైఫిల్, బెంజ్ కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు.