హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి ఏక్రగీవంగా ఎన్నికైన వారి జాబితాను ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుకాచౌదరి, అనిల్కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలం ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్నది. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ సభ్యులు సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, వద్దిరాజు రవిచంద్రల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించింది. అసెంబ్లీలో శాసనసభ్యుల సంఖ్య ఆధారంగా రెండు కాంగ్రెస్కు, ఒకటి బీఆర్ఎస్కు దక్కాయి. కొత్తగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర, అనిల్కుమార్లు మంగళవారం రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రాలను స్వీకరించారు.
విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీస్తాం
విభజన హామీలు నెరవేర్చేందుకు, కేం ద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులను రాబట్టేందుకు ప్రయత్నిస్తానని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన అనంతరం ‘నమస్తే తెలంగాణ’తో ఆయన మాట్లాడుతూ తనకు రెండోసారి రాజ్యసభకు అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. తనపై కేసీఆర్ చూపిన ప్రేమ, ఆదరణ, విశ్వాసాన్ని వమ్ముచేయకుండా బీఆర్ఎస్ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు పునర్వైభవం తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడేందుకు కేసీఆర్ సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు.
అమరవీరులకు నివాళి
రెండోసారి రాజ్యసభకు ఎన్నికైన రవిచంద్ర గన్పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఎంపీ వెం ట ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మున్నూరుకాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవ య్య, అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్దార్ పుట్టం పురుషోత్తం ఉన్నారు.