Minister Harish Rao | మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 56 టిఫా స్కానింగ్ మిషన్లను హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి పేట్ల బురుజు ఆసుపత్రి నుంచి వర్చువల్గా ప్రారంబించారు. హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, కుటుంబ ఆరోగ్య సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్రెడ్డి, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, పెట్ల బురుజు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాలతి, మెటర్నల్ హెల్త్ జేడీ డాక్టర్ పద్మజ, ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శశికల పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ గర్భిణులకు సమాజంలో గౌరవం పెంచేలా, అన్ని దశల్లో ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన సమాచారం కోసం బలమైన పునాది ఏర్పరిచే విధంగా మానవీయ కోణంలో మూడంచెల వ్యవస్థను ప్రారంభించినట్లు చెప్పారు.
ప్రసవానికి ముందు సేవలు (ఏఎన్సీ, 102 అమ్మ ఒడి వాహనాలు), ప్రసవ సమయంలో సేవలు (డెలివరీలు, ఎంసీహెచ్ కేంద్రాలు, ఐసీయూ, ఎస్ఎన్సీయు) , ప్రసవం తర్వాత తర్వాత సేవలు (102 వాహనాలు, కేసీఆరే కిట్స్, చైల్డ్ ఇమ్యునైజేషన్) ఏఎన్సీ చెకప్స్, కేసీఆర్ కిట్లో నమోదైన గర్భిణులకు తప్పనిసరిగా నాలుగు సార్లు ఏఎన్సీ చెకప్స్ తదితర సేవలు మూడంచెల వ్యవస్థలో అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ సేవలు సైతం ప్రస్తుతం అందిస్తున్నామని, ఇకపై ఉచితంగా టిఫా స్కాన్ సేవలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఒకే రోజు ఏకకాలంలో 56 టిఫా మిషన్లు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మతా శిశు సంరక్షణలో విప్లవాత్మకమైన మార్పునకు శ్రీకారం చుట్టిన కేసీఆర్ కిట్ పథకాన్ని పేట్ల బురుజు మెటర్నిటీ ఆసుపత్రి వేదిగా సీఎం కేసీఆర్ ప్రారంభించారని, అదే వేదికగా మరో కార్యక్రమాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. వైద్య సిబ్బంది కృషితో రెండు నెలల్లోపే ఆసుపత్రుల్లో మిషన్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.
పుట్టబోయే పిల్లల్లో లోపాలను గర్భంలో ఉండగానే గుర్తించేందుకు టిఫా (టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్ స్కాన్) దోహదం చేస్తుందన్నారు. ప్రతి నెల సగటున 20వేల మంది గర్భిణులు ఈ సేవలు ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు కలుగుతుందన్నారు. నిపుణులైన రేడియాలజిస్టులు, గైనకాలజిస్టులు స్కానింగ్ చేస్తారన్నారు. శిశువు గర్బంలో ఏ పొజిషన్లో ఉన్నది, జరాయువు (ప్లాసెంటా) ఏ ప్రాంతంలో ఉన్నది, ఉమ్మ నీరు స్థితి వంటి వాటిని గుర్తిస్తారన్నారు. అంతర్జాతీయ నివేదికలు, వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, 7శాతం శిశువుల్లో లోపాలు ఉండే ఉందని, అంటే పుట్టే ప్రతి 100 మందిలో ఏడుగురు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఉండే అవకాశం ఉంటుందని చెప్పారు.
మేనరిక వివాహాలు, జన్యు సంబంధ లోపాలు, ఆలస్యంగా గర్భం దాల్చడం, కొందరికి గర్భం దాల్చినప్పటి నుంచే శారీరక, మానసిక సమస్యలు ఉత్పన్నం కావడం, పోషకాహార లోపం.. ఇలాంటి కారణాల వల్ల శిశువుల్లో లోపాలు తలెత్తే అవకాశం ఉంటుందని వివరించారు. ఇలాంటి లోపాలను టిఫా స్కాన్తో ముందుగా గుర్తించే అవకాశం ఉంటుందని తెలిపారు. గుండె, ఊపిరితిత్తులు వంటి అంతర్గత అవయవాలు, కంటి రెప్పలు, పెదవులు, వేళ్లు, చెవులు, కండ్లు, ముక్కు.. ఇలా ప్రతి అవయవాన్ని 3డీ, 4డీ ఇమేజింగ్ రూపంలో స్కాన్ చేస్తుంది. గ్రహణం మొర్రి, గుండెలో రంధ్రం, కాళ్లు, చేతులు వంకరగా ఉండటం, వెన్నుపూస వంటి అవయవాల్లో ఏవైనా లోపాలు తెలుస్తుందని, కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టగానే సర్జరీ చేయాల్సి రావొచ్చని, ముందే గుర్తించగలిగితే డెలివరీ సమయంలో పీడియాట్రిక్ సర్జన్లను అందుబాటులో ఉంచి ప్రాణాలు రక్షించవచ్చన్నారు.