హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): సినీ ఫైనాన్షియర్ కే వెంకటరత్నారెడ్డి హైదరాబాద్లో రేవ్ పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరు, విశాఖపట్నంలో ఉంటున్న నైజీరియన్ల ద్వారా డ్రగ్స్ కొనుగోలుచేసి, మాదాపూర్లోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో అమ్మాయిలతో కలిసి రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ఆయను తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో (టీఎస్-నాబ్) పట్టుకున్నది. అతనితోపాటు బీ బాలాజీ (నౌకాదళ మాజీ ఉద్యోగి), మురళి అనే వ్యక్తులను అరెస్టుచేసి 2.8 గ్రాముల కొకైక్, 6 ఎల్ఎస్డీ బ్లాట్స్, 11.5 గ్రాముల ఎక్స్టసీ పిల్స్, 20 గ్రాముల గంజాయి, రూ.72,500 నగదు, రెండు కార్లు, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని నెల్లూరుకు చెందిన బాలాజీ హైదరాబాద్లో తరచుగా డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్నాడని, ఆయనకు పలువురు వ్యాపారవేత్తలు, సినీ కళాకారులతో సన్నిహిత సంబంధాలున్నాయని టీఎస్-నాబ్ ఎస్పీ (వెస్ట్) సునీతారెడ్డి వెల్లడించారు.
అలా ఓ పార్టీలో బాలాజీకి పరిచయమైన వెంకటరత్న.. కిక్, ఢమరుకం, బిజినెస్మ్యాన్, లవ్లీ, ఆటోనగర్ సూర్య తదితర చిత్రాలకు ఫైనాన్షియర్గా వ్యవహరించాడని వివరించారు. డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న బాలాజీకి వెంకటరత్న ఫైనాన్స్ చేస్తున్నట్టు తెలిపారు. బుధవారం గుడిమల్కాపూర్లో బాలాజీని పోలీసులు పట్టుకున్నారని, అతను ఇచ్చిన సమాచారం మేరకు మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్ ఫ్లాట్లో సోదాలు నిర్వహించి మిగిలిన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆ సమయంలో ఆ ఫ్లాట్లో వెంకటరత్న, మురళితోపాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నట్టు వెల్లడించారు. గతంలోనూ బాలాజీకి ఇలాంటి కేసులతో ప్రమేయం ఉండటంతో అతనిపై నిఘా పెట్టామని, బాలాజీకి డ్రగ్స్ సరఫరా చేసిన నలుగురు వ్యక్తులతోపాటు 18 మంది కస్టమర్లు పరారీలో ఉన్నారని సునీతారెడ్డి వెల్లడించారు.