మహబూబాబాద్ : జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన డోర్నకల్ మండలం అందనాలపాడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని రామాలయం గుడికి మైకులు కడుతుండగా విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృతి చెందారు. గుడి పక్కన ఉన్న వేప చెట్టును ముగ్గురు వ్యక్తులు ఎక్కారు. సుబ్బారావు (67) మైకు కడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలింది.
కాగా, అతడిని కాపాడే క్రమంలో మస్తాన్ రావు(57), వెంకయ్య (55) ఇద్దరికి షాక్ రావడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. ముగ్గురి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.