హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): 2021-22 యాసంగి సీజన్కు సంబంధించి కస్టమ్ మిల్లింగ్ బియ్యం (సీఎమ్మార్)లో నూక శాతంపై అధ్యయనం చేసేందుకుగాను సీఎస్ సోమేశ్ కుమార్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు రెండు రోజులక్రితం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీకి సీఎస్ సోమేశ్ కుమార్ చైర్మన్గా వ్యవహరించనుండగా.. నీటిపారుదల శాఖ, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, వ్యవసాయశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉండనున్నారు. యాసంగి ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా కాకుండా రా రైస్గా మార్చడం వల్ల నూకశాతం ఎంత వస్తుందనే అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేయనున్నది. హెచ్చుతగ్గులు ఉంటే.. తీసుకోవాల్సిన చర్యలపైనా సూచనలు చేయనున్నది. ఇందుకు సంబంధించిన నివేదికను నెల రోజుల్లో అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈ యాసంగిలో కేంద్రప్రభుత్వం బాయిల్డ్ రైస్కు బదులుగా రా రైస్ మాత్రమే తీసుకుంటామని మొండికేసిన విషయం తెలిసిందే. లేనిపక్షంలో ధాన్యం కొనుగోలు చేసేది లేదంటూ స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో రైతులకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతో ధాన్యాన్ని బాయిల్డ్ రైస్గా కాకుండా రా రైస్ మార్చడం వల్ల కలిగే నష్టాన్ని భరించేందుకు సిద్ధమైన సీఎం కేసీఆర్ వడ్ల కొనుగోలుకు నిర్ణయించారు. సాధారణంగా తెలంగాణలో యాసంగి ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు సుమారు 50శాతం వరకు నూక అయ్యే అవకాశముంది. అయితే నిబంధనల ప్రకారం క్వింటాలు ధాన్యానికి 67శాతం బియ్యాన్ని ఎఫ్సీఐకి అప్పగించాలి. కానీ క్షేత్రస్థాయిలో ఇంత బియ్యం రావడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో క్వింటాలుకు 67 కేజీల బియ్యం ఇవ్వడానికి ఇంకా ఎన్ని కేజీల బియ్యం తక్కువ పడుతున్నాయనేదానిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ తగ్గుదలను ఏ విధంగా భర్తీ చేయాలనేదానిపై కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగానే సీఎస్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ అధ్యయన కమిటీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.