కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 24 : రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆదివారం మావోయిస్టులు, జవాన్లకు మరోసారి జరిగిన భీకర పోరులో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా-దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కటేకళ్యాణ్ ఏరియా కమిటీ ఉన్నదని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దంతెవాడ డీఆర్జీ భద్రతా దళాలు డబ్బా కున్ను అడవుల్లో మావోయిస్టులు ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించాయి.
జవాన్లను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య సుమారు 30 నిమిషాలపాటు భీకరపోరు జరిగినట్టు తెలుస్తున్నది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న జవాన్లు గాలింపు చర్యలు చేపట్టగా, ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభించినట్టు తెలిసింది. వారికి సంబంధించిన ఆయుధ, వస్తు సామగ్రిని సైతం భద్రతా దళాలు స్వాధీనపరుచుకున్నట్టు సమాచారం. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉన్నది.