గద్వాల అర్బన్, జనవరి 20 : కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్ (23), పవన్ (28), ఆంజనేయులు (50), గోవర్ధన్, నవీన్, మహబూబ్ స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు దవాఖానలో పనిచేస్తున్నారు. శుక్రవారం వైద్యశాలకు చెందిన డాక్టర్ కూతురి జన్మదిన వేడుకలకు హాజరయ్యారు.
విందులో పాల్గొన్న వీరు అర్ధరాత్రి సమయంలో వైద్యుడికి చెందిన ఎలక్ట్రిక్ కారుకు చార్జింగ్ పెట్టి ఉంచగా.. అతడి అనుమతి లేకుండానే వాహనం తీసుకొని ఆరుగురు గద్వాల నుంచి ఎర్రవెల్లి వైపు బయలుదేరారు. కారును మహబూబ్ అతివేగంగా నడపడంతో జమ్మిచేడ్ సమీపంలోకి రాగానే అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. కారు దెబ్బతినడంతో అందులోని నరేశ్, పవన్, ఆంజనేయులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.