న్యూస్ నెట్ వర్క్, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో వేర్వేరుగా సంభవించిన రోడ్డు ప్రమాదాల వల్ల పలు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, పది మందికిపైగా గాయాలపాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారిమడూరు గ్రామశివారు వద్ద గూడ్స్ ఆటోను లారీ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ బర్మావత్ రమేశ్ (30), మామిడి రైతు తేజావత్ వెంకన్న (45) తీవ్రగాయాలై, అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రమేశ్ది తిరుమలాయపాలెం మండలం తిప్పారెడ్డిగూడెం అజ్మీరాతండా కాగా, వెంకన్న స్వగ్రామం జెల్లపల్లి. లారీ డ్రైవర్ పోలుదాసు నరేశ్ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కాగా, కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రం సమీపంలో ఆటో బోల్తా కొట్టింది. అదే ఆటోలో పదోతరగతి పరీక్ష రాసేందుకు బిచ్కుంద వెళ్తున్న శిరీష(15)కు తీవ్రగాయాలయ్యాయి. దవాఖానకు తరలిస్తుండగా ఆమె మృతిచెందింది. మిగతా ప్రయాణికులకు గాయాలయ్యాయి. అజాగ్రత్తగా ఆటో నడిపిన డ్రైవర్ సంజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
మరో ఘటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలో సోమవారం పదో తరగతి పరీక్ష రాసి, ఇంటి తిరిగి వస్తుండగా విద్యార్థుల ఆటో బోల్తాకొట్టింది. దీంతో చిన్నతూండ్ల గ్రామానికి చెందిన స్వరూప, మేకల హరీశ్, పులిగంటి ప్రవీణ్, హర్షితకు గాయాలు కాగా, తాడిచెర్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అదేవిధంగా, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం బూరెడ్డిపల్లి గ్రామసమీపంలో ఆర్టీసీ బస్సు.. లారీని ఓవర్టేక్ చేయబోయి ఢీకొన్నది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, ప్రయాణికులు వెంకటేశ్, కృష్ణవేణి, మధుమోహన్, శ్రీదేవి, లక్ష్మీనారాయణ, సత్యసాయితోపాటు మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను మహబూబ్నగర్ దవాఖానకు తరలించారు. ఈ ఘటనల్లో పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.