హుజూరాబాద్: కరీంనగర్ (Karimnagar) జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని బోర్నపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ బోర్నపల్లి వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో అటుగా వస్తున్న బైక్పై ఆ మట్టి పడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంలో మట్టిని తొలగించి మృతదేహాలను వెలికితీశారు.
మృతులను బోర్నపల్లికి చెందిన వర్ష (15), గంట విజయ్ (17), గంట సింధూజ (18)గా గుర్తించారు. గ్రామంలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి జాతరలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టిప్పర్ లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలిపారు.