హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలీలో (Gachibowli) ఘోర కారు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో వేగంగా దూసుకొచ్చిన కారు హెచ్సీయూ వద్ద అదుపుతప్పి డివైడర్ మధ్యలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు డ్రైవర్ సహా ఇద్దరు మహిళా జూనియర్ ఆర్టిస్టులు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు.
మృతులను కారు డ్రైవర్ అబ్దుల్ రహీమ్ (విజయవాడ), ఎం మానస (మహబూబ్నగర్), ఎన్ మానస (కర్ణాటక)గా గుర్తించారు. అబ్దుల్ రహీం బ్యాంక్ ఉద్యోగికాగా, మహిళలు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులు. గాయపడిన వ్యక్తి సిద్ధు అలియాస్ సాయి సైదులు అని, అతడు కూడా జూనియర్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నాడని చెప్పారు. వీరు అమీర్పేటలోని హాస్టల్ ఉంటున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.