హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణకేంద్రం ప్రకటించింది. రాగల 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు నైరుతి అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్ ప్రాంతం, దక్షిణ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలపై మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించింది.