హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కొన్ని రోజుల ముందు ప్రకటించిన విధంగా 3 డీఏలు మంజూరు చేస్తూ సంస్థ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పండుగ అడ్వాన్స్లు, గతంలో డీఏ ఎరియర్స్ను సైతం బుధవారం నుంచి ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి.
ప్రభుత్వ నిర్ణయంతో 47 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. అక్టోబర్ వేతనంతోపాటు 3 డీఏలు, పండుగ అడ్వాన్స్, గతంలోని డీఏ ఎరియర్స్ ఖాతాలో జమకానుండటంతో ఆర్టీసీ ఉద్యోగులు ఖుషీఖుషీగా ఉన్నారు. మూడు డీఏలు కలిపి మొత్తం 12.3 శాతం వరకు వేతనంలో పెరుగుదల ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి ఉద్యోగికి వారి సర్వీస్ను బట్టి సగటున నెల వేతనం రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు పెరుగుతుందని వివరించారు. పండుగ అడ్వాన్స్ కింద ప్రతి ఉద్యోగికి రూ.4,500 జమ చేస్తున్నారు. గతంలో ప్రకటించిన డీఏ ఎరియర్స్కు సంబంధించి 5 నెలల బకాయీలు ప్రతి ఉద్యోగికి సగటున రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు ఈ నెల ఖాతాలో జమకానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు వారి సీనియారిటీని బట్టి వారి నెల వేతనంతోపాటు రూ.11,500 నుంచి రూ.15 వేల వరకు అదనంగా రానున్నది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకొన్న సీఎం కేసీఆర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ ఉద్యోగులందరి తరఫున, టీఎంయూ పక్షాన కృతజ్ఞతలు. ఇచ్చిన మాట ప్రకారం డీఏలు ఇవ్వడంతోపాటు పండుగ అడ్వాన్స్, డీఏ ఎరియర్స్ కలిపి ఈ నెల వేతనంలో వస్తుండటంతో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు.
– థామస్రెడ్డి, ఆర్టీసీ టీఎంయూ నేత.