హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్ రోడ్డు (ట్రిఫుల్ఆర్) ఉత్తర భాగంలో 57.8921 హెక్టార్ల (144 ఎకరాలు) అదనపు భూమి సేకరణకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ మూడు అదనపు గెజిట్లను విడుదల చేసింది. పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇంటర్ చేంజ్ల డిజైన్లలో మార్పుల కారణంగా అదనంగా 144 ఎకరాల భూమిని మూడు యూనిట్ల పరిధిలో సేకరించాల్సి వచ్చింది.
చౌటుప్పల్ ఆర్డీవో పరిధిలోని భూసేకరణ యూనిట్లో వలిగొండ మండలం రెడ్లరేపాక, పొద్దటూర్, పహిల్వాన్పూర్, గోకారం గ్రామాల పరిధిలో, చౌటుప్పల్ మండలంలోని చౌటుప్పల్, నేలపట్ల గ్రామాల పరిధిలో 15.5633 హెక్టార్ల (38.90825 ఎకరాలు), యాదాద్రి భువనగిరి అడిషనల్ కలెక్టర్ భూసేకరణ యూనిట్ పరిధిలోని తుర్కపల్లి మండలంలో దత్తాయిపల్లి, వీరారెడ్డిపల్లి, వేల్పుపల్లి, యాదగిరిగుట్ట మండలంలోని దాతర్పల్లె గ్రామాల్లో 26.2976 హెక్టార్ల (65.744 ఎకరాలు) భూమి, అందోల్-జోగిపేట ఆర్డీవో పరిధిలోని భూసేకరణ యూనిట్లో చౌటకూర్ మండలం శివంపేటలో 16.0312 హెక్టార్ల (40.078 ఎకరాలు) భూమి సేకరణకు మూడు క్యాపిటల్ ఏ అడిషనల్ గెజిట్లను విడుదల చేసింది.