కవాడిగూడ, మార్చి 4: టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ను ఒకేసారి వేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవి రెండూ ఒకేసారి వేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరాలు ఏమిటని ప్రశ్నించారు. సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేలాది మంది నిరుద్యోగులు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ టెట్ వేయకపోవడం వల్ల బీఎడ్, డీఎడ్ పాసైన నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 24 వేల పైచిలుకు పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.