టీచింగ్ దవాఖానలు వైద్యరంగంలో ప్రజలకు కల్పతరువులా మారాయి. మెరుగైన చికిత్స అందిస్తూ ప్రజల ఆరోగ్యానికి కొండంత భరోసా ఇస్తున్నాయి. కేవలం మైనర్, మేజర్ సర్జరీల రూపంలోనే ప్రజలకు ఏటా ఏకంగా రూ.వెయ్యి కోట్లకుపైగా లబ్ధి చేకూరుతున్నది. ఓపీ, ఐపీ సేవలు, ప్రసవాలు, వైద్య పరీక్షలు వీటికి అదనం. ఇవి కూడా కలుపుకొంటే ఏటా సుమారు రూ.2 వేల కోట్ల వరకు చేరుతుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 2014 నాటికి టీచింగ్, అనుబంధ దవాఖానలు కలిపి 19 ఉండేవి. ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తుండటంతో వీటి సంఖ్య పెరుగుతున్నది. ప్రస్తుతం 23 దవాఖానలు ఉన్నాయి. వీటిల్లో ఏటా సగటున సుమారు 2.5 లక్షల సర్జరీలు జరుగుతున్నాయి. మేజర్ సర్జరీలు 81,380, మైనర్ సర్జరీలు 1.67 లక్షలు నిర్వహిస్తున్నారు.
‘పేదలకు ఎంత పెద్ద వ్యాధి వచ్చినా.. ఒక్క రూపాయి కూడా భారం కాకుండా ప్రభుత్వ దవాఖానల్లో పూర్తి ఉచితంగా చికిత్స పొంది సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వెళ్లాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం’ అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్తుంటారు. దీనికి తగ్గట్టే రాష్ట్రంలో అరుదైన సర్జరీలకు గాంధీ, ఉస్మానియా వంటి టీచింగ్ దవాఖానలు కేరాఫ్గా నిలుస్తున్నాయి. చిన్న సర్జరీలు మొదలు క్యాన్సర్ ట్రీట్మెంట్, అవయవ మార్పిడి వరకు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రపంచంలోనే అరుదైన జన్యువ్యాధులకు సైతం ఇక్కడ చికిత్స లభిస్తున్నది. ఇటీవల ఉస్మానియా వైద్యులు జగిత్యాల జిల్లాకు చెందిన 10 నెలల శిశువుకు ‘నియోనాటల్ ఇక్తియోసిస్ స్కాల్ప్ అలోపేసియా చొలాంగియో హైపటైటిస్’ ఆపరేషన్ చేసి, ప్రాణాలు కాపాడారు. ఇది దేశంలోనే మొదటిది. ప్రపంచంలోనే నాలుగోది. ఇలాంటి అరుదైన ఆపరేషన్ల విలువను డబ్బుతో లెక్కించలేమని వైద్యులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే 4 కాలేజీలు అందుబాటులోకి రాగా.. ఈ ఏడాది మరో 8 కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. మరో రెండేండ్లలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు కానున్నది. ఇవి పూర్తయితే మారుమూల ప్రాంతాలకు సైతం టీచింగ్ దవాఖానల సేవలు అందనున్నాయి.
నిజామాబాద్ మెడికల్ కాలేజీ అనుబంధ జనరల్ దవాఖాన ఇటీవలే కొత్త రికార్డు సృష్టించింది. గత నెల 26న ఉస్మానియా, గాంధీ దవాఖానలకు దీటుగా వైద్య సిబ్బంది ఒక్క రోజులోనే 59 సర్జరీలను పూర్తిచేశారు. ఐదు ఆపరేషన్ థియేటర్లలో ఆరు విభాగాలకు చెందిన 59 సర్జరీలు జరిగాయి. అంటే.. సగటున ఒక్కో గంటకు రెండున్నర సర్జరీలు, ప్రతి రెండు గంటలకు 5 సర్జరీలు జరిగాయి. ఇందులో 20 ప్రసవాలు, 9 జనరల్ సర్జరీలు, 8 ఎముకల సర్జరీలు, 20 ఆప్తమాలజీ సర్జరీలు, 2 ఈఎన్టీ విభాగం ఆపరేషన్లు చేశారు. ప్రభుత్వ దవాఖానల్లో వైద్యం సరిగా అందదనే అపవాదును వైద్యులు దూరం చేస్తున్నారు.
టీచింగ్ దవాఖానలకు ప్రభుత్వం అత్యాధునిక వైద్యసదుపాయాలను కల్పిస్తున్నది. క్యాథ్ల్యాబ్లు వంటి రూ.కోట్లు విలువైన సదుపాయాలు కల్పించడంతోపాటు అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు అందజేస్తున్నది. పాథాలజీ, బయోకెమిస్ట్రీ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నది. గతంలో ఏవైనా పరికరాలు కావాలంటే ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడు మంత్రి హరీశ్రావు దృష్టికి తీసుకెళ్తే వెంటనే నిధులు మంజూరు చేస్తూ, కొనుగోలు ప్రక్రియ ప్రారంభం అయ్యేలా చూస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని వైద్యులు సైతం అందిపుచ్చుకొని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటయితే హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండానే వంద కిలోమీటర్లలోపే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయి.
– రమేశ్రెడ్డి, డీఎంఈ
నిజామాబాద్ దవాఖానకు ప్రస్తుతం రోజూ 1,000-1,500 వరకు ఓపీ పేషెంట్లు వస్తున్నారు. గతంతో పోల్చితే దాదాపు రెట్టింపయ్యారు. ప్రజావైద్యంపై ప్రజలకు నమ్మకం పెరిగిందనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు నేతృత్వంలో దవాఖానల్లో మౌలిక వసతులు పెరిగాయి. దీంతో సర్జరీల సంఖ్య పెరిగింది. మా దవాఖానలో ఒకే రోజు 59 సర్జరీలు చేయడం ఆషామాషీ కాదు.
– డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ మెడిసిన్ హెడ్, నిజామాబాద్ జనరల్ దవాఖాన