Paddy Procurement | వరంగల్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అరిగోస పడుతున్నారు. సర్కారు నిర్లక్ష్యంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో రేయింబవళ్లు పడిగాపులుకాస్తున్నారు. వడ్లను ఎండపోసి, కుప్పపోసి కాపలా ఉంటూ అదనపు భారాన్ని మోస్తున్నారు. ప్రభుత్వం నుంచి ధాన్యం కొనుగోలుపై స్పందన లేకపోవడంతో విసిగి వేసారి దళారులు, వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు క్వింటాలుకు రూ. 200 ధర తగ్గించి ఇచ్చి రైతులను దగా చేస్తున్నారు. ‘రైతులకు ధాన్యం కొనుగోలుపై రూ. 500 బోనస్ ఇస్తాం’ అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. బోనస్ సంగతి దేవుడెరుగు.. కనీసం ధాన్యం కొనుగోళ్లను సరిగా చేయడం లేదని రైతులు వాపోతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారులు పోటీపడి మరీ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కాంటా మాత్రమే పెట్టి, ఫొటోలు దిగి ఉన్నతాధికారులకు పంపించారు. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గోనె సంచులు ఇంతవరకూ చేరలేదు. ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. కొనుగోలు కేంద్రంలోని సిబ్బందిని అడిగితే బస్తా సంచులు వచ్చినప్పుడు కొనుగోళ్ల ప్రక్రియ మొదలుపెడతామని అంటున్నారు. యాసంగి వరి కోతలు మొదలై ఇప్పటికే పది రోజులు దాటింది. మరో వారం రోజుల్లో కోతలు పూర్తికానున్నాయి. అప్పటికీ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు మొదలయ్యే పరిస్థితి కనిపించడలేదు.
దళారుల దగా..
ఓ వైపు ఎండలు.. మరోవైపు అకాల వర్షాల హెచ్చరికలు.. అయినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల రైతులు ధాన్యం కుప్పలతో పడిగాపులు పడుతున్నారు. ప్రతి రోజూ వడ్లను ఎండపోసి, కుప్పపోస్తున్నారు. దీంతో కూలీల భారం రైతులపై పడుతున్నది. ధాన్యం కుప్పలు తెచ్చి వారం రోజులు గడుస్తున్నా కొనుగోలు మాత్రం కావడంలేదు. కొనుగోలు కేంద్రాల వద్ద ఐకేపీ సిబ్బంది ఎవరూ ఉండడంలేదు. దీంతో రైతులే సద్ది కట్టుకుని కాపాలా ఉంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు రూ.2,203, సాధారణ రకం క్వింటాకు రూ.2.183లుగా కనీస మద్దతు ధర కల్పించింది. కొనుగోళ్ల కోసం వేచి ఉండి విసిగి వేసారిన రైతులు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా వారు క్వింటాకు రూ.200 ధర తగ్గించి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. పైగా కల్లాల్లోనే తాలు పట్టి తెస్తేనే కొంటామని వ్యాపారులు మెలిక పెడుతున్నారు. మొత్తం వడ్లను తూర్పార పట్టడం అంటే కూలీ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయని, ఇంత చేసినా పండిన పంటకు కనీస మద్దతు ధర రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సదుపాయాలు కరువు
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 3న వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. కొనుగోలు కేంద్రాల వారీగా వచ్చే వడ్లను తరలించేందుకు ప్రభుత్వం రైస్మిల్లులను కేటాయిస్తున్నది. ప్రస్తుత సీజన్లో ఇలాంటి ప్రక్రియను ఇప్పటికీ పూర్తి చేయలేదు. కాంటా పెట్టిన వడ్లను ఏ మిల్లుకు తరలించాలనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. కొనుగోలు కేంద్రాల్లో మాయిశ్చర్ చూసి టోకెన్లు అందజేయాల్సిన వ్యవసాయ అధికారులకు ఇంతవరకు టోకెన్ బుక్కులు అందలేదు. తీవ్రమైన ఎండలు ఉన్నా కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేయడంలేదు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు కొనుగోలు కేంద్రంలో రైతులు ఉండేందుకు నీడ లేకపోవడంతో టెంట్ వేశారు. అది గాలులకు కూలిపోయింది. పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వడ్లు ఆరబోసేందుకు సిమెంటు గచ్చు లేకపోవడంతో కమలాపూర్ మార్కెట్ యార్డులో ఐకేపీ కొనుగోలు కేంద్రానికి రైతులు వడ్లను తరలిస్తున్నారు. కమలాపూర్ మండలంలో మొత్తం 16 కొనుగోలు కేంద్రాల్లో ఒక్క ఉప్పల్ కొనుగోలు కేంద్రానికి మాత్రమే బస్తా సంచులు వచ్చాయి. మిగిలిన కేంద్రాల్లో సంచులు లేకపోవడంతో కొనుగోళ్లు జరగడంలేదు.
2 కిలోల కోత పెడుతున్నరు
ఐకేపీ కొనుగోలు కేంద్రంల వడ్లు ఆరబెట్టిన. ఇంకా బార్దాన్ రాలేదంటున్నరు. ఎప్పుడు ఇస్తరో ఎవరూ చెప్తలేరు. మిల్లర్ల వద్దకు పోయి బార్దాన్ తెచ్చుకుని వాళ్లకే రైతులు అమ్ముతుండ్రు. అక్కడ నూక, తాలు, తేమ అని చెప్పి కాంటాల్లో 2 కిలోల కోత పెడుతున్నరు. కాంటాలు కాకపోతే ఖర్చులు మీద పడుతున్నయ్. మిల్లర్లు అడిగినకాడికి అమ్ముకుంటున్నం.
– కిన్నెర గోపి, కమలాపూర్, హనుమకొండ జిల్లా.
ఎప్పుడు కొంటరో
నాకు మూడెకురాల పొలం ఉన్నది. వరి కోసి వడ్లను ఐకేపీ సెంటర్లో పోసి ఐదు రోజులైతాంది. వడ్లు మంచిగ ఎండినయ్. తేమ 15 శాతం వస్తున్నదని కుప్పపోసిన. ఎప్పుడు కొంటరో అని ఎదురుచూస్తున్న. వడ్లు కాంటా అయ్యి మిల్లుకు పోయే వరకు కొనుగోలు కేంద్రంల రైతులదే బాధ్యత అని చెప్పుతున్నరు. బార్దాన్ అయితే ఇస్తలేరు. ఎప్పుడు కొంటరో ఏందో?
-వెంగల రాజేశ్, కమలాపూర్, హనుమకొండ జిల్లా.
తొందరగా వడ్లు కొనాలి
మార్కెట్కు వడ్లు తెచ్చి మూడు రోజులు దాటింది. ఇక్కడికి ఎవరూ రాలే. తేమ చూసే సార్లు కూడా రాలే. రోజుకు ఐదారుసార్లు వడ్లను నేర్పుతున్నా. ఇప్పటికైనా తొందరగా కాంటాలు పెట్టి వడ్లను కొనాలే. – అర్తం రమ, ఎల్కతుర్తి, హనుమకొండ జిల్లా
నాల్గు రోజులైతాంది
నాకున్న నాలుగు ఎకరాల్లో యాసంగిలో దొడ్డురకం వరి ఏసిన. నాలుగు రోజుల కిందట వరి కోసి కమలాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంల వడ్లు పోసిన. ఆరబోసిన వడ్లు ఎండినయ్. ఎత్తుతామంటే బార్దాన్(బస్తాలు) ఎప్పుడు వస్తదో చెప్తలేరు. పండుగ సెలవులు ఉన్నయని ఏదేదో చెబుతాండ్రు.
– కుమ్మరి రాజు, గూడూరు, కమలాపూర్ మండలం, హనుమకొండ జిల్లా