కమ్మర్పల్లి, డిసెంబర్ 29: రైతుబంధు పథకంతో రైతులకు పంట సాగు ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది. బోరు మోటరు పాడయినా, డ్రిప్, పైపులైన్లు రిపేర్లకు వచ్చినా వెంటనే బాగు చేయించుకొని సాగు కష్టాలను అధిగమిస్తున్నారు. చేతిలో డబ్బు ఉండటంతో నలుగురు కూలీలను అధికంగా నియమించుకొని పనిచేసుకొంటున్నారు. తాను సైతం సీఎం కేసీఆర్ అందిస్తున్న రైతుబంధు పథకంతో కష్టాల నుంచి బయటపడ్డానని చెప్తున్నాడు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రానికి చెందిన రైతు వేముల రమేశ్. యాసంగి పెట్టుబడి సాయం డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడుతున్నవేళ రమేశ్ను ‘నమస్తే తెలంగాణ’ పలుకరించింది. రమేశ్ అనుభవం ఆయన మాటల్లోనే..
అన్నిరకాలా అక్కరకొస్తున్నది
రైతుబంధు మస్తు తీర్ల పనికొస్తున్నది. నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. యాడాదిల రెండుసార్లు రైతుబంధు పైసలు పడ్తున్నయ్. గా పైసలతోని ఇత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తెచ్చుకుంట. రైతుబంధు సీఎం కేసీఆర్ మొదలుపెట్టినప్పటి సంది వచ్చిన పైసలతోనే పైపులు కరాబైతే మంచిగ జేపిచ్చుకున్న. డ్రిప్పులు సతాయిస్తే మంచిగ జేపిచ్చుకున్న. రైతుబంధు పెట్టకమునుపు పంట పెట్టుబడికి తిప్పలు అయితుండే. ఇప్పుడు రైతుబంధు పైసలు కూలీలకు ఇచ్చేందుకు కూడా పనికొస్తున్నయ్. చేతిలో పైసలు లేకున్నా రెండు దినాలు ఆగి రైతుబంధు పైసలు వడ్డంక ఇస్తమన్నా కూలోళ్లు ఆగుతున్నరు. గిట్ల అన్నితీర్ల రైతుబంధు అక్కరకొస్తున్నందునే ఎక్కువ పంట వేస్తున్న.
కేంద్రప్రభుత్వం ఇచ్చేవాటిపై నమ్మకంలేదు
సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.5వేల చొప్పున వానకాలం, యాసంగి కలిపి రూ.10 వేలు ఇస్తున్నడు. పెద్దమొత్తం కావట్టి ఏదన్న పని ఎల్లదీసుకునేటట్టు పనికస్తయ్. సెంట్రల్ గవర్నమెంటోళ్లు ఇచ్చేవి తక్కువ కదా దేనికి సరిపోతయ్? రైతుబంధుతో సీఎం కేసీఆర్ మాకు అండగ ఉంటున్నడు. రైతుకాలంజేస్తే పది దినాల్లోనే ఇంటికి రూ.5 లక్షలు రైతుబీమా గూడా ఇస్తున్నడు. 24 గంటలు కరెంటు ఇస్తుండనేవట్టె. గింత జేస్తున్న కేసీఆర్ సార్ ముందట సెంట్రల్ సర్కారోళ్లు జేత్తున్నదెంత? ఉల్టా వడ్లు గొనేది లేదనవట్టిరి.