తొర్రూరు, ఫిబ్రవరి 26 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఆర్యభట్ట పాఠశాల హాస్టల్లో ఇద్దరు విద్యార్థులను బలి ఇచ్చేందుకు గుర్తు తెలియని వ్యక్తులు యత్నించారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు గురువారం పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. విద్యార్థులు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. పెద్దవంగర మండలం టీక్యాతండాకు చెందిన ధరావత్ హర్షవర్ధన్, అన్నారం పెద్దతండాకు చెందిన లునావత్ జగదీశ్ ఆర్యభట్ట పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో హాస్టల్లోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇద్దరు విద్యార్థుల కాళ్లు, చేతులు, నోరు కట్టేసి ఉరివేసే ప్రయత్నంచేశారు.
అదే సమయంలో మరో విద్యార్థి నీళ్ల కోసం లేచినప్పుడు ఈ విషయాన్ని గమనించగా అనుమానితులు అకడి నుంచి పారిపోయి హాస్టల్ వార్డెన్ మురళి గదిలోకి వెళ్లారు. టవల్, దుస్తులను చింపి ఒకదానికొకటి ముడివేసి హత్యాయత్నం చేసినట్టు విద్యార్థులు పేర్కొన్నారు. ఈ ఘటనకు వార్డెన్ మురళి బాధ్యుడని విద్యార్థులు ఆరోపించారు.
వార్డెన్ గదిలో ఉన్న టూల్స్బాక్స్లో సుత్తి, కంపాస్ వంటి పరికరాలు ఉండేవని, అవి కనిపించకపోవడం అనుమానాస్పదంగా ఉందని చెప్పారు. నూతన భవనానికి నరబలి ఇచ్చేందుకు యత్నించారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడారు. వారి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్టు ఏఎస్సై శివరామకృష్ణ తెలిపారు. ఎంఈవో బుచ్చయ్యను వివరణ కోరగా తమకు సమాచారం రాలేదని, ఒకవేళ వస్తే పూర్తి విచారణ చేపడుతామని వెల్లడించారు.