హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ) : ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం వారు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్, నయీం కేసు, భూ కుంభకోణాలు, ఇతర రాజకీయ అవినీతి కేసుల విచారణ కీలక దశలో ఉన్నప్పుడే ప్రమాదం జరుగడంపై అనేక అనుమానాలున్నాయని పేర్కొన్నారు. కీలకమైన ఫైళ్లు, డిజిటల్ డాటాకు నష్టం వాటిల్లలేదని అధికారులు చెబుతున్నప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరమున్నదని చెప్పారు. గతంలో సచివాలయం, ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్లో ప్రభుత్వ రికార్డులే తగలబడటం వెనుక ఉన్న కారణాలను వెల్లడించడంతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో రికార్డులకు భద్రత కల్పించాల్సిన అవసమున్నదని అభిప్రాయపడ్డారు. ఏయే కేసుల ఫైళ్లు కాలిపోయాయో పూర్తి వివరాలను వెంటనే ప్రకటించాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో, రికార్డ్ రూముల్లో అగ్నిప్రమాదాల నివారణకు తక్షణమే ‘సేఫ్టీ ఆడిట్’ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.