Medaram : సమ్మక్క-సారలమ్మ (Sammakka-Saralamma) పూజారులు బుధవారం తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ తిరుగువారం పండుగ అనంతరం మేడారం మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. ఆదివాసి పూజారులు పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తాళాలు వేస్తారు. తిరుగువారం సందర్భంగా మేడారంలో భక్తుల రద్దీ నెలకొంది.
కాగా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం జాతర నాలుగు రోజులపాటు కన్నుల పండువగా సాగింది. కీలక ఘట్టమైన సమ్మక్క వన ప్రవేశంతో శనివారం నాటికి జాతర పరిసమాప్తమైంది. మేడారం గద్దెపై నుంచి చిలకలగుట్టకు సమ్మక్క చేరుకుంది. కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగిడిద్దరాజు, కొండాయికి గోవిందరాజులు చేరారు. మేడారం జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.
దాదాపు కోటిన్నరకు పైగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు మంత్రులు, మాజీమంత్రులు, ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు మేడారం జాతరకు వచ్చి అమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు.