తెలంగాణకు పచ్చని చీర కట్టించి..
2014 కంటే ముందు తెలంగాణ రైతులకు సాగు సవాళ్లతో కూడుకొన్న వ్యవహారం. వానకాలంలో వర్షాలు పడితేనే పంటలు సాగయ్యేవి. యాసంగిలో భూములన్నీ బీడుగానే ఉండేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మించి సాగునీటి గోస తీర్చారు. ఫలితంగా 2014-15లో మొత్తం సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుగా ఉంటే, 2022-23నాటికి అది 2.08 కోట్ల ఎకరాలకు పెరిగింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మొత్తం ఆదాయం రెట్టింపైంది.
రైతుకు నిరంతర విద్యుత్తునిచ్చి…
2014 కంటే ముందు ఎవుసానికి 4-6 గంటల కరెంటు ఇవ్వడమే గొప్ప. అదీ రాత్రిపూటే. అయితే, రైతాంగానికి ఎంతచేసినా తక్కువేననుకొన్న సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తుకు శ్రీకారం చుట్టారు. దీని కోసం రూ. 39,321 కోట్లతో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను బలోపేతం చేశారు. అలా 2018 జనవరి 1 నుంచి సాగుకు 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. ఇప్పటివరకూ ఉచిత విద్యుత్తు కోసం సర్కారు రూ. 90 వేల కోట్లు ఖర్చు చేసింది.
పొలానికి అమృతధార పారించి..
తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ జలమాగాణం అయ్యింది. 2014కు ముందు గోదావరి నుంచి 90 టీఎంసీలను కూడా పూర్థిస్థాయిలో వాడుకోలేని దుస్థితి నుంచి నేడు గరిష్ఠంగా 400 టీఎంసీలకు పైగా వినియోగించుకొనే స్థాయికి చేరుకొన్నది. 2014లో వ్యవసాయానికి 62.48 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందే పరిస్థితులు ఉండగా, 2023నాటికి ఏకంగా 1.4 కోట్ల ఎకరాలకు సాగు నీటి వసతి అందుబాటులోకి వచ్చింది.
రైతుకు పెట్టుబడి సాయమందించి..
2014కు ముందు పంట పెట్టుబడి సాయం కోసం తెలంగాణ రైతన్న షావుకార్ల దగ్గర చెయ్యిచాచి అప్పులపాలయ్యేవాడు. పెట్టుబడి కోసం ఇలా ఏ రైతూ అవస్థలు పడకూడదన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ 2018లో రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టారు. రెండు సీజన్లకు కలిపి ఏటా ఎకరానికి రూ. 10 వేల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలో డబ్బును ప్రభుత్వమే పెట్టుబడి సాయంగా జమచేస్తున్నది. ఇప్పటివరకూ 11 విడతల్లో 68 లక్షల మంది రైతులకు రూ. 72,817 కోట్లు జమయ్యాయి.
రాష్ట్రమంతా ఎరువుల నిల్వలుంచి..
తెలంగాణ ఏర్పడేనాటికి ఎరువుల కొరత భారీగా ఉండేది. కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఈ సమస్యపై దృష్టిసారించారు. అలా 2014లో 25 లక్షల టన్నులుగా ఉన్న ఎరువుల పంపిణీ, 2022-23నాటికి 40 లక్షల టన్నులకు చేరింది. కేసీఆర్పాలనలో సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో ఎరువుల వినియోగమూ పెరిగింది. అయినప్పటికీ, కొరత ఉండకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకొన్నది. 2014 కంటే ముందు 1.5 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే బఫర్ స్టాక్గా ఉండేవి. ఇప్పుడు ఆ స్టాక్ 5 లక్షల టన్నులకు పెరిగింది.
రైతు రుణాన్ని చుక్తాగా చెల్లించి..
రాష్ట్రంలోని ఏ రైతు నెత్తిన కూడా అప్పు ఉండకూడదన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీకి చర్యలు తీసుకొన్నది. 2014లో రూ. లక్షలోపు రుణం ఉన్న 35 లక్షల మంది రైతులకు చెందిన రూ. 16 వేల కోట్ల రుణాలను, 2018-23 మధ్య రూ. లక్షలోపు రుణం ఉన్న 23 లక్షల మంది రైతులకు చెందిన రూ. 20 వేల కోట్ల రుణాలను మాఫీ చేసింది. అలా మొత్తంగా రెండు విడుతల్లో కలిపి ఇప్పటివరకూ 58 లక్షల మంది రైతులకు చెందిన రూ. 36 వేల కోట్ల రుణాల మాఫీ జరిగింది.
ధరణితో యజమానికి ధైర్యమిచ్చి..
2014కు ముందు భూతగాదాలు, రిజిస్ట్రేషన్లలో అవినీతి పెచ్చరిల్లేది. దీంతో అన్నదాతల భూములకు రక్షణ కల్పించడానికి, వేగంగా, సులభంగా భూ లావాదేవీలు పూర్తికావడానికి రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 2020లో ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. 2023 మే నాటికి 2 కోట్ల ఎకరాల భూములు ధరణిలో రికార్డయ్యాయి. 19.4 లక్షలకు పైగా లావాదేవీలు పూర్తయ్యాయి. 66 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ధరణి పోర్టల్ సాయంతో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వేగంగా పూర్తయ్యి కేవలం పావుగంటలోనే పట్టా చేతికి వస్తున్నది.
తెలంగాణను అన్నపూర్ణగా మలిచి..
తినడానికి సరిపడా పంట పండితే చాలు అనుకొన్న తెలంగాణ.. ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే స్థాయిలో ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నది. ఒకప్పుడు ధాన్యం కొనుగోళ్లలో 14వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. ఇప్పుడు దేశంలోనే అగ్రగామిగా మారింది. 2014లో రాష్ట్రంలో 68 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా ప్రస్తుతం ఇది 2.6 కోట్ల టన్నులకు చేరింది. దేశవ్యాప్తంగా చూస్తే రాష్ట్ర వాటా 14 శాతానికి చేరింది. 2014-15లో వరి సాగు రెండు సీజన్లలో కేవలం 34.98 లక్షల ఎకరాల్లో జరిగితే, 2022-23లో ఏకంగా 1.21 కోట్ల ఎకరాలకు పెరిగింది.
రైతు కుటుంబానికి ధీమాగా నిలిచి..
రైతన్న ఏదైనా కారణంతో మరణిస్తే, అతడి కుటుంబం వీధినపడే దుస్థితి గతంలో ఉండేది. దేశానికి బువ్వపెట్టే అన్నదాత కుటుంబానికి అలాంటి పరిస్థితి ఉండకూడదని సీఎం కేసీఆర్ భావించారు. అందుకే, 2018లో ‘రైతు బీమా’ పథకానికి శ్రీకారం చుట్టారు. కారణం ఏదైనా కావొచ్చు.. రైతు మరణిస్తే ఆ రైతు కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున ఈ స్కీం కింద పరిహారం అందజేస్తారు. ఇప్పటివరకూ 1,11,320 మంది రైతు కుటుంబాలకు రూ. 5,566 కోట్లను పరిహారంగా తెలంగాణ ప్రభుత్వం అందజేసింది.