హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): భారీ వర్షాలకు చరిత్రాత్మక గండిపేట చెరువు (ఉస్మాన్సాగర్) నిండుకుండలా మారడంతో జలాశయం 12 గేట్లను అధికారులు ఎత్తారు. మంగళవారం రాత్రి పది గంటలకు 12 గేట్లు ఎత్తి 7,308 క్యూసెక్కుల నీటిని జలమండలి అధికారులు దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి 6,800 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నది. దాదాపు 12 ఏండ్ల తర్వాత 12 గేట్లను ఎత్తివేయడం విశేషం. 2010లో కురిసిన భారీ వర్షాల కారణంగా అప్పట్లో ఐదు వేల పైచిలుకు క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. ఇప్పుడు 7,308 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గండిపేట చెరువు నీటి విడుదల కారణంగా మంచిరేవుల నుంచి నార్సింగికి వచ్చే రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
మూసీలో పెరిగిన వరద ప్రవాహం
మలక్పేట: సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి తోడు.. హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గేట్లను ఎత్తి నీటిని కిందికి వదలటంతో మూసీలో వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం మధ్యాహ్నం వరకు మూసారాంబాగ్-అంబర్పేట చాందినీ బ్రిడ్జి వద్ద నీటిమట్టం బ్రిడ్జికి అడుగున్నర కిందికి ఉండగా, సాయంత్రం వరకు ప్రవాహం పెరిగి బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తుంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తుగా కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. ట్రాఫిక్ను గోల్నాక న్యూ బ్రిడ్జివైపు మళ్లించారు.
కృష్ణా, గోదావరిలో తగ్గిన వరద
రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులకు వరద తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం నాటికి కృష్ణా బేసిన్లోని ఆల్మట్టికి 25 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 18 వేల అవుట్ ఫ్లో కొనసాగుతున్నది. నారాయణపూర్కు 7,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నది. జూరాలకు 24,500 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, దిగువకు 26,160 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఎగువ నుంచి 36,914 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 35,666 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉన్నది. శ్రీశైలం ప్రాజెక్టుకు 37,695 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 62,095 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి 60,417 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 1000 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది. రిజర్వాయర్కు ఎగువ నుంచి వరద వస్తుండటంతో వానకాలం పంటల సాగు కోసం సాగర్ ఎడమ కాల్వకు ఈ నెల 28న మంత్రి జగదీశ్రెడ్డి నీటి విడుదల చేయనున్నారు. కృష్ణ బేసిన్లోని దిగువన పులిచింతల ప్రాజెక్టుకు 13,678 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉండగా, 10,066 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది. గోదావరి బేసిన్లో కూడా వరద తగ్గుముఖం పట్టింది. కాళేశ్వరం ప్రాజెక్ట్లోని లక్ష్మీబరాజ్లో 85 గేట్లు ఎత్తి వరద నీరును దిగువకు వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టుకు 5,697 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 3,105 క్యూసెక్కుల అవుట్ఫ్లో ఉన్నది. నిజాంసాగర్ ప్రాజెక్టులో 3,900 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 7,200 క్యూసెక్కుల అవుట్ఫ్ల్లో ఉంది. ఎల్లంపల్లి రిజర్వాయర్కు 1,32,134 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, 1,25,940 క్యూసెక్కుల అవుట్ఫ్లో కొనసాగుతున్నది.