‘తెలంగాణ చేసిన అప్పులు పరిమితి దాటిపోతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నది’ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ఇటీవల తెలంగాణలో రేషన్షాపుల పర్యటనకు వచ్చినప్పుడు అన్న మాటలివి!
తెలంగాణ అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధిలోపలే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నప్పటికీ.. బీజేపీ నేతలు పదే పదే తెలంగాణకు వచ్చి చేసే ప్రేలాపనలివి!
గురివింద గింజ తన నలుపు ఎరుగదంటే ఇదేనేమో..
గుజరాత్ మాడల్ అంటూ నిరంతరం తెగ ఊదరగొట్టే బీజేపీ నేతలు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేడిపండు చందంగా ఉన్నదో, అది చేస్తున్న అప్పుల సంగతేందో పెదవి కూడా విప్పరు. గుజరాత్ మాడల్ ఎంత గొప్పగా ఉన్నదో.. ఆర్థిక క్రమశిక్షణ లేక అప్పుల కుప్పలా మారిన ఆ రాష్ట్ర దుస్థితిని చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న హయాం నుంచి ఇప్పటి వరకు చేసిన అప్పులే ఇందుకు నిదర్శనం. గుజరాత్ను సంపన్న రాష్ట్రంగా గొప్పలు చెప్పుకొనే కమలనాథులు చెప్పే దాంట్లో ఎంతటి వాస్తవం ఉన్నదో అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి కానూ దేశాయి ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో వెల్లడించిన లెక్కలే చెప్తున్నాయి.
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ కాషాయదళం చేసే ప్రచారం ఎంతటి బక్వాసో అర్థమై పోతుంది. కొత్త రాష్ట్రం, పైగా చిన్న రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పు కంటే గుజరాత్ చేసిన అప్పే ఎక్కువని ఆ పార్టీ మంత్రే లెక్కలతో సహా అంగీకరిస్తున్నారు. ఈ విషయంపై పల్లెత్తు మాట మాట్లాడని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్.. తెలంగాణ చేసిన అప్పులు పరిమితి దాటిపోతున్నట్టు ఇటీవల తెలంగాణ రాష్ర్ట పర్యటన సందర్భంగా పెడబొబ్బలు పెట్టారు.
మోదీ హయాంలో చేసిన అప్పే ఎక్కువ
గుజరాత్లో బీజేపీ అధికారంలోకి వచ్చేనాటికి 1995లో ఆ రాష్ట్ర అప్పు 10 వేల కోట్లు మాత్రమే. కాగా, 2001లో మోదీ సీఎంగా బాధ్యతలు స్వీకరించే నాటికి రూ.45,301 కోట్లకు చేరుకొన్నది. 2014 వరకు మోదీ హయాంలో రూ.2.21 లక్షల కోట్లకు పెరిగింది. ఆ తర్వాత గత ఎనిమిదేండ్లలో రూ.3.2 లక్షల కోట్లకు చేరుకొన్నది. గుజరాత్ జీఎస్డీపీలో అప్పుల వృద్ధి రేటు 11.2 శాతంగా ఉన్నట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) బయట పెట్టింది. అప్పుల వృద్ధి రేటు ఇలాగే కొనసాగితే 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.4.5 లక్షల కోట్లకు చేరుకొంటుందని అంచనా వేసింది. చేసిన అప్పులో 2028 నాటికి రూ.1.87 లక్షల కోట్లు గుజరాత్ ప్రభుత్వం చెల్లించకపోతే ఆర్థికస్థితి గతి తప్పినట్టేనని హెచ్చరించింది కూడా.
పెట్టుబడులన్నీ ఉత్తుత్తివే..
మోదీ సీఎంగా ఉన్న 2003 నుంచి 2011 వరకు జరిగిన గుజరాత్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా 84 లక్షల కోట్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులకు (ఎఫ్డీఐ) ఒప్పందాలు కుదిరినట్టు గొప్పగా ప్రకటించుకొన్నారు. దీంతో కాషాయదళం ‘మోదీ’ని వికాస్ పురుష్గా, డెవలప్మెంట్ చాంపియన్గా ఆకాశానికి ఎత్తింది. ఇది ఓ రకంగా ఆయన్ను జాతీయ నాయకుడిగా ప్రచారం చేసుకోవడానికి అవకాశమిచ్చింది. కానీ, 2003 నుంచి 2011 వరకు గుజరాత్ ప్రభుత్వం చేసుకొన్న ఎఫ్డీఐలలో 8 శాతం మాత్రమే అమలురూపం దాల్చినట్టు డైరెక్టర్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ బయటపెట్టింది. ఇది కూడా తప్పేనని వాస్తవానికి కార్యరూపం దాల్చిన విదేశీ పెట్టుబడి 4 శాతం మాత్రమేనన్నది డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ బహిర్గతం చేసింది.
మోదీ హయాంలో గుజరాత్లో ఎఫ్డీఐల తగ్గుదల ఇలా
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) అధ్యయనం ప్రకారం 2000 నుంచి 2013 వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్డీఐ) గుజరాత్ వాటా 4 శాతం మాత్రమే. ఇదే వ్యవధిలో భారతదేశానికి మొత్తంగా రూ.9.1 లక్షల కోట్ల ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు రాగా ఇందులో గుజరాత్కు వచ్చింది రూ.39 వేల కోట్లేనని డీఐపీపీ బయటపెట్టింది.