జమ్మికుంట : గొల్ల, కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేసి వారిని లక్షాధికారులుగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని దినేష్ కన్వెన్షన్ హాల్లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి తలసాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారన్నారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం ముఖ్య మంత్రి మానసపుత్రిక అని అన్నారు. రూ. 11 వేల కోట్లతో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
గొర్రెల పంపిణీ కార్యక్రమంలో యూనిట్ ధర గతంలో రూ. 1,25,000 ఉండేదని కాగా రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో దానిని రూ. 1,25,000 నుండి రూ. 1,75,000 కు పెంచినట్లు తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 28న జమ్మికుంటలో ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని అర్హులైన లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో లబ్ధిదారుల వాట క్రింద 2,874 మంది డీడీలు చెల్లించారని తెలిపారు. ఇంకా 1,500 మంది డీడీలు చెల్లించాల్సి ఉందన్నారు. వారు కూడా వెంటనే డీడీలు చెల్లించాలని మంత్రి తెలిపారు.
గొర్రెల పంపిణీ పథకం ద్వారా పంపిణీ చేసిన గొర్రెలకు వైద్యం అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 100 అంబులెన్సులు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఎలాంటి వ్యాధి సోకినా వెంటనే 1098 కు ఫోన్ చేస్తే అంబులెన్స్ ద్వారా వైద్యులు ఇంటి వద్దకే వచ్చి మూగజీవాలకు వైద్య సేవలు అందిస్తారన్నారు.
యాదవులకు కొమురవెల్లి మల్లన్న, కురుమలకు బీరప్ప దేవుడు ఎలాగో వారిద్దరి స్వరూపం ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలను ఆదుకునేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ , రైతు బంధు, రైతు బీమా పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నట్లు చెప్పారు. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు.