హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : అంతర్జాతీయ భాషల్లోనూ మన విద్యార్థులు ప్రావీణ్యత సాధించేందుకు విద్యాశాఖ కృషిచేస్తున్నది. అందులోభాగంగా విదేశీ భాషలను క్రమంగా ప్రవేశపెడుతున్నది. తాజాగా ఈ విద్యాసంవత్సరం డిగ్రీ సెకండియర్లో ఫ్రెంచ్ భాషను చేర్చింది. ద్వితీయ భాషగా, కాంపొజిట్ కోర్సుగా ఈ భాషను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ఫ్రెంచ్ భాష పాఠ్యపుస్తకాన్ని సోమవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు.
గత విద్యాసంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో రెండో భాషగా ఫ్రెంచ్ను ప్రవేశపెట్టారు. ఇందుకోసం హైదరాబాద్లోని అలయన్స్ ఫ్రాంచైజ్ సంస్థతో ఉన్నత విద్యామండలి ఒప్పందం కుదుర్చుకొన్నది. ఈ కోర్సు సిలబస్, కరికులం రూపకల్పనకు 9 మంది నిపుణుల కమిటీ ఈ పుస్తకాన్ని రూపొందించింది. ఎస్సీ, ఎస్టీ గురుకుల డిగ్రీ కాలేజీల్లో ఈ కోర్సును నిర్వహిస్తుండగా, విద్యార్థులు గణనీయంగా చేరారు. ఈ కార్యక్రమంలో అలయన్స్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ బెర్తెట్, మౌడ్ టైకార్ట్, అశ్వినిగోయల్, ప్రవీణ్ మామిడాల తదితరులు పాల్గొన్నారు.