Thirukalyanam | భద్రాచలం : తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో జీయర్మఠంలో గరుడ పటాన్ని చిత్రీకరించగా దేవనాథ రామానుజా స్వామి ఆవిష్కరించారు. అనంతరం రామాలయానికి తీసుకొచ్చి గరుడాదివాసం నిర్వహించారు. మంగళవారం ఉదయం బేడా మండపంలో అగ్ని మథనం జరిపారు. ఆచార్యుడు అగ్ని సమిథలను శిరస్సుపై ఉంచుకొని మూలమూర్తులకు చూపించి యాగశాలలో అగ్నిప్రతిష్టాపన చేశారు. బ్రహ్మోత్సవాల రక్షణ కోసం గరుత్మంతుడిని ఆహ్వానించి ఆరాధనలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేవస్థానం ఈవో రమాదేవి ఈ గరుడ ధ్వజపటానికి ధ్వజారోహణం చేశారు. అనంతరం అష్టదిక్పాలకులకు బలిహరణం నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు. కల్యాణానికి ముందురోజు స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా నిలిపి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. సాయంత్రం ఉత్తర ద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామివారిని, సీతమ్మవారిని ఎదురెదురుగా ఉంచి, స్వామివారి వంశ ప్రవరను అర్చక స్వామి వివరిస్తుండగా.. సీతమ్మ వారి తరఫున ఉన్న అర్చక స్వామి అమ్మవారి రూప లావణ్యాలను, గుణగణాలను వివరించనున్నారు.