భద్రాచలం: భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ నవమి సందర్భంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవానికి భద్రాచలం క్షేత్రం ముస్తాబైంది. ఉదయం 8 నుంచి 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాతంగా తిరుకల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం కల్యాన ఘట్టానికి వేదిక అయిన మిథిలా స్టేడియానికి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా తీసుకెళ్తారు. అయితే ముందుగా మిథిలా స్టేడియంలో పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన నిర్వహించనున్నారు. తర్వాత యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు నిర్వహిస్తారు.
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్వామివారికి పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. సోమవారం శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం జరుగనుంది. ఈ వేడుకకు గవర్నర్ తమిళిసై హాజరవనున్నారు.
మహోత్సవంకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తుల కోసం మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు సిద్ధంచేశారు. భద్రాచలం క్షేత్రానికి ఆర్టీసీ 400 బస్సులను నడుపుతున్నది.