Tigers | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతమైంది. విషం తిన్నదని అనుమానిస్తున్న మూడో పులి (ఎస్6) ఆచూకీ దొరికింది. దరిగాం అడవుల్లో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో ఎస్6 పులి కనిపించింది. ఎస్6 పులితో పాటు మూడు పిల్లలు కూడా సురక్షితంగా ఉన్నాయని అటవీశాఖ అధికారులు గుర్తించారు.
విషప్రయోగంలో మృతి చెందిన ఎస్-9 (మగపులి)తోపాటు ఎస్-6 ఆడపులి, వాటి పిల్లలైన నాలుగు పిల్లలు కాగజ్నగర్ డివిజన్లోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నాయి. వీటిలో ఎస్-9 మగపులి, దానితోనే కలిసి తిరిగే పులిపిల్ల ఎస్-15 చనిపోయాయి. అప్పట్నుంచి ఆడపులి అయిన ఎస్-6, దాని పిల్లలైన మరో మూడు పులులు కనిపించలేదు. అయితే వీటిలో ఎస్-6 పులి కూడా విషాహారం తిన్నదని అటవీ అధికారులు అనుమానించారు. ఈ క్రమంలో మూడో పులి చనిపోయిందా? బతికే ఉన్నదా అనే సందిగ్ధం నెలకొంది. దీంతో 120 మంది సిబ్బందితో కూడిన 24 బృందాలు కనిపించకుండా పోయిన పులి జాడ కోసం అడవి మొత్తం జల్లెడ పట్టారు. 105 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం మూడింటి పాదముద్రలను గుర్తించగా.. తాజాగా ట్రాప్ కెమెరాల్లో ఎస్-6 పులి దాని పిల్లల ఆచూకీ లభించింది.
కాగజ్నగర్లోని అటవీ ప్రాంతంలో ఇటీవల రెండు పులుల మృతి చెందడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న అటవీ శాఖ అధికారులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వాంకిడి మండలం వెల్లి పంచాయతీ పరిధిలోని రెంగరీట్ గ్రామానికి చెందిన కోవా గంగు, ఆత్రం జల్పతితోపాటు ఓ బాలుడు(11) విషప్రయోగం చేసిన వారిలో ఉన్నారని అటవీ అధికారులు తెలిపారు. వీరిని కోర్టులో హాజరు పరచగా ఇద్దరికి 12 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిందని.. మైనర్ను పేరెంటల్ బాండ్పై రిలీజ్ చేశారని పేర్కొన్నారు.