కరీంనగర్లో కేంద్ర హోంమంత్రి నివాసానికి కూతవేటు దూరం! పోలీసుల నాకాబందీ జరిగి 24 గంటలైనా కాలేదు! జనసంచారం ఎక్కువగా ఉండే రహదారి! అయినా దోపిడీ ముఠా దేన్నీ లెక్కచేయలేదు. మాస్కులు లేకుండానే వచ్చి, కాల్పులు జరుపుతూ నగల దుకాణాన్ని లూటీచేసింది. 12 నిమిషాల్లోనే పని ముగించుకొని దర్జాగా వెళ్లిపోయింది.
కరీంనగర్ విద్యానగర్, మే 3: కరీంనగర్ నగరం నడిబొడ్డున, అత్యంత రద్దీగా ఉండే జ్యోతినగర్ ప్రాంతంలో, కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కార్యాలయానికి కూతవేటు దూరంలో, పట్టపగలు సాయుధ దుండగులు నగల దుకాణాన్ని దోచుకున్నారు. జ్యోతినగర్లోని పీఎంజే జ్యువెల్లరీకి ఆదివారం ఉదయం 11 గంటలకు కస్టమర్లలా వచ్చిన ఐదుగురు దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపి సినీ ఫక్కీలో దోపిడీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. దుండగులు ఒక్కొక్కరుగా దుకాణంలోకి వచ్చారు. ఆభరణాలు చూపించాలంటూ సిబ్బందిని మాటల్లో దింపారు. నలుగురు లోపలికి రాగా, ఐదో వ్యక్తి ప్రధాన ద్వారం వద్ద ఉన్నాడు. స్ట్రాంగ్ రూమ్ లాకర్ నుంచి నగలు తెచ్చిన సిబ్బంది వీరికి చూపించగా ఒక వ్యక్తి గన్ తీసి అందరూ లొంగిపోవాలని, లేదంటే కాల్చేస్తానని బెదిరించాడు. సిబ్బందిని అప్రమత్తం చేసిన షాపు ఇన్చార్జి ముస్తాక్, దుండగులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించాడు.
కానీ ఒక దుండగుడు అతనిపై కాల్పులు జరిపాడు. ఈ పెనుగులాటలో ఆయన తల పై భాగానికి దెబ్బ తగలడంతో అతడు అక్కడే కుప్పకూలాడు. ఆ దుండగుడు నగల దుకాణం సిబ్బంది కమలాసన్, రాజేశ్, మధూకర్పై కూడా కాల్పులు జరిపాడు. దీంతో సిబ్బంది భయభ్రాంతులకు గురికాగా.. అందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి మోకాళ్లపై కూర్చోబెట్టి చేతులు కట్టివేశారు. మూతులకు ప్లాస్టర్ వేశారు. ఇద్దరు దుండగులు వీరికి కాపలా ఉండగా.. ముగ్గురు దుండగులు నగలను సర్దుకున్నారు. ఈ సమయంలో సిబ్బంది భయాందోళనకు గురై అరవడంతో దుండగులు అక్కడి నుంచి బయటకు వచ్చి అప్పటికే అక్కడ ఏర్పాటు చేసుకున్న బ్లాక్ కలర్ పల్సర్ బైక్, వైట్ కలర్ అపాచీ బైక్పై పారిపోయారు. దుండగులు మొత్తం మూడు సంచుల్లో నగలను నింపుకొన్నట్టు తెలుస్తుండగా, రెండు సంచులు అక్కడే పడేసి ఒక సంచిని మాత్రమే తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీల ఆధారంగా ఉదయం 11.01 నుంచి 11.13 నిమిషాల మధ్య దొంగతనం జరిగిందని చెప్పారు.
ఐజీ పరిశీలన
తెలంగాణ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్రెడ్డి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. క్రైమ్ సీన్ను పరిశీలించి, పురోగతిపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు. దవాఖానకు వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఆయన వెంట కరీంనగర్ సీపీ గౌస్ఆలం పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. ఘటన గురించి తెలియగానే కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నగల దుకాణం వద్ద బాధితులను పరామర్శించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి దవాఖానలోని బాధితులను పరామర్శించారు.
సమాచారం ఇస్తే లక్ష బహుమతి
దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ఎనిమిది బృందాలను ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. జిల్లాలో హైఅలర్ట్ ప్రకటించి, ప్రతి పోలీస్స్టేషన్కూ సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. దోపిడీకి సంబంధించిన సీసీ ఫుటేజీతోపాటు నిందితుల ఫొటోలను విడుదల చేశారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే, వెంటనే పోలీస్స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. దొంగలు నల్లరంగు పల్సర్ బైక్, తెల్లరంగు అపాచీ బైక్లపై సంచరిస్తున్నారని తెలిపారు. సీసీ ఫుటేజీలో కనిపించిన వ్యక్తులను ఎవరైనా గుర్తించినా లేదా వారికి సంబంధించిన సమాచారం ఉన్నా వెంటనే డయల్ 100, 8712670744, 8712670745 నంబర్లకు తెలుపాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారికి లక్ష రూపాయల బహుమానం ఇస్తామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రకటించారు.