జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల(Gadwal) జిల్లా కేంద్రంలో దొంగలు(Thieves) రెచ్చిపోతున్నారు. ఇంటికి తాళాలు వేసి వెళ్తే చాలు.. దొంగలు ఇండ్లను గుల్లా చేసున్నారు. మూడు రోజుల క్రితం జిల్లా కేంద్రం లోని పాత హౌసింగ్ బోర్డులో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా ఆదివారం గద్వాల పట్టణం పాత హౌసింగ్ బోర్డులో శ్రీనివాస శాస్త్రి ఇంట్లో చోరీ జరిగింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగులగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడారు. ఇంట్లో ఉన్న మూడు తులాల బంగారం, కొంత వెండి అపహరణకు గురైనట్లు బాధితుడు పేర్కొన్నారు. అదే విధంగా అదే కాలనీలో నివాసం ఉంటున్న రమణ ఇంటి తాళాలు పగులగొట్టేందుకు యత్నించగా.. ఎంతకూ రాకపోవడంతో దొంగలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఘటన స్థలానికి గద్వాల పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు.
కాగా, గత కొంతకాలంగా గద్వాలలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఒకే కాలనీలో వరుస దొంగలు పాల్పడటం గమనార్హం. పోలీస్ పెట్రోలింగ్ లేకపోవడంతోనే దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని, గట్టి నిఘా పెట్టి దొంగలను పట్టుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.