ఫర్టిలైజర్సిటీ, ఫిబ్రవరి 10: పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరిఖని గౌతమినగర్లో గల ఓ బ్యాంకు ఏటీఎం కేంద్రంలో భారీ చోరీ జరిగింది. గ్యాస్ కట్టర్తో మెషిన్ను కట్ చేసి ఏకంగా రూ.27.75 లక్షలు లూటీ చేశారు. శనివారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గోదావరిఖని గంగానగర్లోని ఫ్లైవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు.
అర్ధరాత్రి 1.34 గంటలకు సీసీ కెమెరా వైర్లను కట్చేయడంతో అలారం మోగగా పరారయ్యారు. అక్కడి నుంచి ఎన్టీపీసీ రింగ్రోడ్ మీదుగా ఆర్ఎఫ్సీఎల్కు వెళ్లే మార్గంలో అభయాంజనేయస్వామి, అయ్యప్పస్వామి దేవాలయం మధ్యగల గౌతమినగర్ ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి చేరుకున్నారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఏటీఎంలోకి ప్రవేశించి సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టి, వైర్లను కత్తిరించారు. తర్వాత గ్యాస్ కట్టర్ సాయంతో మెషిన్ను కత్తిరించారు. అందులోని రూ.27,75,400 నగదును దోచుకుని ఉడాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.