నాగర్ కర్నూలు: జిల్లా కేంద్రంలో దొంగలు హల్చల్ చేశారు. నేషనల్ హైస్కూల్ కాంప్లెక్స్లో ఉన్న మీన జ్యువెల్లర్స్కు దుండగులు కన్నం వేశారు. లక్షల విలువైన వెండి, బంగారం, నగదు చోరీచేశారు. దుకాణం వెనుక భాగం గోడకు కన్నం వేసి దుకాణంలోకి చొరబడ్డ దొంగలు డిస్ప్లేలో ఉన్న సుమారు 20 కిలోల వెండి వస్తువులు, కౌంటర్ లో ఉన్న సుమారు రూ.20 వేలు, ఒకటిన్నర తులాల బంగారం దొంగలించినట్లు గుర్తించారు. షాప్లో ఉన్న లాకర్ను తెరవడానికి విఫల ప్రయత్నం చేశారని మీన జువెల్లర్స్ యజమాని ఖదీర్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.