హైదరాబాద్: పక్కనే పోలీస్ కమిషనరేట్. అయినప్పటికీ దొంగలు ఓ బ్యాంకులో చోరీకి విఫలయత్నం చేశారు. అయితే స్ట్రాంగ్ రూం తెరచుకోకపోవడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగింది.
గచ్చిబౌలిలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దుండగులు చోరీకి ప్రయత్నించారు. మంగళవారం అర్ధరాత్రి బ్యాంకులోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు.. స్ట్రాంగ్ రూం తలుపులు తెరచుకోక పోవడంతో వెనుదిరిగారు. పోతూపోతూ బ్యాంకులో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా కంప్యూటర్లు, హార్డ్డిస్కులు ఎత్తుకెళ్లారు. విషయాన్ని గ్రహించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సెబరాబాద్ కమిషనరేట్ పక్కనే ఉన్న బిల్డింగ్లో బ్యాంక్ ఉండటం గమనార్హం.