హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేస్తూ తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని డీఎస్సీ-2008 బాధిత అభ్యర్థులు సీఎం రేవంత్రెడ్డిని కోరారు. సోమవారం భారీ సంఖ్యలో అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకొన్నారు. ముఖ్యమంత్రి అందుబాటులో లేకపోవడంతో.. సీఎం వ్యక్తిగత కార్యదర్శి జైపాల్రెడ్డి, సీఎంవో కార్యదర్శి మాణిక రాజ్ వారితో చర్చించారు. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో, 2008 డీఎస్సీలో నష్టపోయిన మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని ఈ నెల 8న హైకోర్టు ప్రభుత్వానికి సూచించిందని తెలిపారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని నష్టపోయిన అభ్యర్థులకు అక్కడి ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. ఒకే నోటిఫికేషన్కు సంబంధించిన బాధితులకు ఒక రాష్ట్రంలో ఉద్యోగాలిచ్చి, మరో రాష్ట్రంలో రోడ్డున పడేయడం భావ్యం కాదని కోర్టు అభిప్రాయపడిందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగాలిచ్చి వారిని ఆదుకోవాలని సూచించినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయం కోసం 15 ఏండ్లుగా ఎదురుచూస్తున్న తమకు ఇప్పటికైనా ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఈ అంశంపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని, రెండు రోజుల్లోగా సీఎంకు నివేదిక అందజేస్తామని చెప్పారు. అధికారుల హామీతో బాధితులు వెనుదిరిగారు. వారం రోజులు చూసి.. మరోసారి సీఎంను కలవాలని నిర్ణయించినట్టు ‘డీఎస్సీ-2008 సెలెక్టెడ్ మెరిట్ బీఈడీ క్యాండిడేట్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు పాతూరి ఉమామహేశ్వర్రెడ్డి తెలిపారు.