ఖమ్మం, డిసెంబర్ 26: దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక శక్తుల ఐక్యత అత్యంత అసవరమని, ఆ దిశగా కార్యాచరణ జరగడం ఆవశ్యకమని సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు.దేశంలో పెరిగిపోతున్న దోపీడికి వ్యతిరేకంగా, సమసమాజమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు. సీపీఐ 98వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆ పార్టీ శ్రేణులు ఎర్రచొక్కాలు ధరించి ఖమ్మంలో కవాతు నిర్వహించాయి.
ఇందిరానగర్ పైలాన్ వద్ద పార్టీ పతాకాన్ని పువ్వాడ నాగేశ్వరరావు ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో పువ్వాడ మాట్లాడుతూ.. బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా బీజేపీయేతర శక్తులతో కలిసి నడుస్తున్నామని చెప్పారు. ఐటీ, ఈడీ దాడులు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారాల నేపథ్యంలో కమ్యూనిస్టులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సమయానికి పొత్తులను ప్రకటిస్తాం
ఖమ్మం, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్తో పొత్తులపై ఇంకా చర్చలు జరగలేదని, ఎన్నికల సమయానికి ప్రకటన చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఖమ్మంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. సీట్ల విషయంలో జరుగుతున్నవన్నీ ఊహాగానాలేనన్నారు. తనకు పాలేరు నుంచి పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ రోజురోజుకూ బలహీన పడుతున్నట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా కూడా అదే పరిస్థితి ఉన్నదని పేర్కొన్నారు. జాతీయస్థాయిలో బీజేపీకి ఇతర పార్టీలను ఎదుర్కొనే శక్తి లేదన్నారు. తెలంగాణలోకి బీజేపీ ప్రవేశించకుండా అడ్డుకునేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలూ తమ పార్టీ చేస్తున్నదని అన్నారు.