Congress | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి సికింద్రాబాద్ సీటు కొరకురాని కొయ్యగా మారింది. ఇక్కడి నుంచి పార్టీ అభ్యర్థిగా రంగంలో దింపిన ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రచారంలో పూర్తిగా వెనుకబడినట్టు అంతర్గత సర్వేలో బయటపడటం అధిష్ఠాన పెద్దలను కలవరపరుస్తున్నది. దానం అభ్యర్థిత్వం పట్ల నియోజకవర్గ ప్రజలలో కూడా పెద్దగా స్పందన వ్యక్తం కావడం లేదన్న ఈ సర్వే పార్టీ పెద్దలను ఆందోళనకు గురి చేస్తున్నది. పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు టీమ్ ఈ విషయం ముందే హెచ్చరించినప్పటికీ పార్టీ పెద్దలు సీరియస్గా తీసుకోలేదని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలలో హైదరాబాద్ నుంచి ఎవరూ గెలుపొందకపోవడంతో నగరంలో కాస్తోకూస్తో గుర్తింపు ఉన్న దానం నాగేందర్ను కాంగ్రెస్లో చేర్చుకోవడానికి పార్టీ పెద్దలు ఆసక్తి కనబరిచారు. మరో అడుగుముందుకేసి అధిష్ఠానాన్ని ఒప్పించి ఆయనను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దించారు.
రెండో జాబితాలోనే దానం పేరును ప్రకటించినప్పటికీ ఆయన ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం ప్రారంభించకపోవడం పట్ల అధిష్ఠానం సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఇందుకు దానం సన్నిహితలు చెప్పే కారణం మరోలా ఉంది. సికింద్రాబాద్లో తనను అభ్యర్థిగా ప్రకటించాక కూడా అధిష్ఠానం వేరొక అభ్యర్థి (బొంతు రామ్మోహన్)ను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్టు సమాచారం అందడం వల్ల దానం పూర్తిస్థాయిలో ప్రచారం ప్రారంభించలేకపోతున్నారని చెప్తున్నారు. సికింద్రాబాద్లో అభ్యర్థి మార్పుపై పునరాలోచన చేసిన మాట వాస్తవమేనని పీసీసీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను కాంగ్రెస్ మోసం చేసిందన్న సంకేతాలు వెళ్లడం వల్ల చేరికలు ఆగిపోతాయన్న ఉద్దేశంతో ఆ ప్రయత్నం మానుకున్నామని అంటున్నారు.
అంతర్గత సర్వేలో దానం పట్ల ఓటర్లలో అంతగా సానుకూలత లేనప్పటికీ, గతంలో ఆయనకు పార్టీతో ఉన్న అనుబంధం, మంత్రిగా పనిచేసిన అనుభవం, హైదరాబాద్లో పార్టీ అవసరాలు ఆయనకు టికెట్ ఇవ్వడానికి కారణమని గుర్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ టికెట్ను మొదట మాజీ మేయర్ బొంతు రామ్మోహన్కు ఇవ్వాలని భావించారు. అయితే దానం నాగేందర్ వంటి సీనియర్ నాయకుడు పార్టీలో చేరడంతో ఆయననే అభ్యర్థిగా ప్రకటించారు. వాస్తవానికి పార్టీ అంతర్గత సర్వేలో నాగేందర్ కంటే బొంతు రామ్మోహన్ అభ్యర్థిత్వానికే ఎక్కువ శాతం ఓటర్లు సానుకూలత వ్యక్తం చేశారని ఈ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
దానం అభ్యర్థిత్వం ఖరారైన తరువాత సీఎం రేవంత్రెడ్డి ఇంట్లో సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నేతలు, సమన్వయ కమిటీతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో సికింద్రాబాద్లో సిట్టింగ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి మళ్లీ పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ స్థానం అత్యంత ప్రతిష్ఠాకరమని గుర్తు చేసినప్పటికీ దానం నుంచి కనీస స్పందన కనిపించడం లేదని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది. తాజాగా నిర్వహించిన ఫ్లాష్ సర్వేలో కూడా దానం మూడో స్థానంలో ఉన్నట్టు తెలిసింది. ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించిన 14 స్థానాల్లో పీసీసీ నేతలు ఎప్పటికప్పుడు ఫ్లాష్ సర్వే నిర్వహిస్తూ అధిష్ఠానానికి నివేదికలు పంపుతున్నారు.
సికింద్రాబాద్లో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నా, కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం వారిని అందుకోలేనంత దూరంలో ఉన్నారని తెలిసింది. దీనిని అధిగమించడానికి నాగేందర్ చొరవ తీసుకోవడం లేదని అధిష్ఠానానికి నివేదిక అందినట్టు సమాచారం. శుక్రవారం ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో కూడా సికింద్రాబాద్ అంశం చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ సీనియర్ నాయకుడు వ్యాఖ్యానించారు.