సూర్యాపేట : తెలంగాణలో ఎవరెన్ని యాత్రలు చేసినా ఫలితం శూన్యం. ఎంపీ బండి సంజయ్ పాదయాత్రలు చేసినా, మోకాలి యాత్రలు చేసినా అవి కాశీ యాత్రలే అవుతాయని మంత్రి జగదీష్రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణ 2014 కు ముందు ఆ తర్వాత ఎలా ఉందో ప్రజలకు తెలుసన్నారు. ప్రజల జీవితాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వెలుగులు నింపారన్నారు. సంజయ్ లాంటి వారిని ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు.
బండి పాదయాత్ర చేసినా ఆయన ప్రజలకు చెప్పేది ఏమీ ఉండదన్నారు. మోదీ సర్కార్ను దించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ నిర్ణయాన్ని అమలు చేయాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని మంత్రి తెలిపారు. యాత్రలలో బండి సంజయ్ ప్రజలకు ఏం చెబుతాడు. పెట్రోల్ 100, డీజిల్ 100, గ్యాస్ 1000 కి పెంచినం అని చెబుతాడా? ఓట్లు వేస్తే మళ్లీ డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచుతామని చెబుతారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.