మహబూబ్నగర్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఆయన జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దళిత జాతి ఎన్నో అవమానాలకు, అణిచివేతలకు గురైందన్నారు. స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికి ఇంకా అక్కడక్కడ వివక్షత కొనసాగడం బాధాకరమన్నారు.
ఇలాంటి వివక్షతను అందరం అణచి వేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థను కూకటివేళ్లతో సహా పెకలించి వేయాలని పిలుపునిచ్చారు. దళితులు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగినప్పుడే అభివృద్ధి సాధ్యమని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన వల్ల దళితులకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించారని ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఉద్యోగాలతో పాటు, అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తున్నామని , ఇటీవల ఎక్సైజ్ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 30 శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. దళిత బంధు ద్వారా ఒక్కో ఎస్సీ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అంద చేయడమే కాక, దళితులకు అన్ని రంగాలలో, ఆర్థిక వనరులు ఉన్న ప్రతి చోట అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
బడుగు, బలహీన వర వర్గాల జాతులు చైతన్యమవ్వాలని, అసమానతలు రూపుమాపటంలో కలిసి రావాలని అన్నారు. జిల్లాలో పేదరికాన్ని, వలసలను రూపు మాపి ఇక్కడి వారికి ఇక్కడే ఉద్యోగాలు కల్పించి జిల్లా వాసులు సుఖ సంతోషాలతో జీవించేల చేయడమే తన ధ్యేయమన్నారు. తన ఊపిరి ఉన్నంతవరకు జిల్లా కోసం పనిచేస్తానని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి దళిత బంధు కింద 17 ట్రాక్టర్లు, 2 బొలెరో లు, గూడ్స్ వాహనాన్ని లబ్ధిదారులకు అందజేశారు. అంతేకాక కులాంతర వివాహాలు చేసుకున్న నాలుగు జంటలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. స్టడీ సర్కిల్ ద్వారా గ్రూప్స్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేశారు.
కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కె. సి నరసింహులు ,వైస్ చైర్మన్ తాటి గణేష్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యాదయ్య, జిల్లా అధికారులు, దళిత సంఘాల నాయకులు మల్లె పోగు శ్రీనివాస్, బోయిన్ పల్లి నరసింహులు, మంత్రి నరసింహ,కావలి కృష్ణయ్య,సూర్య ప్రకాష్, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలరాజ్, బాలయ్య, ఉద్యోగ సంఘ నాయకులు చంద్రనాయక్, రాజీవ్ రెడ్డి, జిల్లా గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు రాజగోపాల్, పలువురు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.