ఖానాపురం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదు.. ఇక ఆరు గ్యారెంటీలకు దిక్కెక్కడిదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆమె నర్సంపేట మాజీ ఎమ్మేల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి వరంగల్ జిల్లా ఖానాపురం మండలం బుధరావుపేటలోని ఈదులకుంటలో ఉపాధి కూలీలతో మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని ఈ సందర్భంగా వారిని కోరారు. కూలీలతో కలిసి ఉపాధి పనులు చేశారు. గడ్డపారతో మట్టిని తవ్వి, ఎత్తి ట్రాక్టర్లో పోశారు.
అనంతరం మాలోత్ కవిత మాట్లాడుతూ.. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినప్పటికీ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు నమ్మి ప్రజలు మోసపోయారని అన్నారు. 5 నెలల కాలంలోనే మళ్లీ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నట్లు తెలిపారు. మహబుబాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎక్కడికి వెళ్లినా తనను ప్రజలు తమ ఇంటి ఆడబిడ్డలా ఆదరిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ రోడ్ షోకు భారీగా తరలివచ్చి విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతులు తెలిపారు.