హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా బీఎస్సీ డిగ్రీలో ప్రవేశపెట్టిన నాలుగేండ్ల కంప్యూటర్ సైన్స్ కోర్సుకు తీవ్ర డిమాండ్ నెలకొన్నది. తొలిసారిగా 14 కాలేజీల్లో 60 సీట్ల చొప్పున ఈ కోర్సును ప్రవేశపెట్టారు. శుక్రవారం దోస్త్ తొలి కౌన్సెలింగ్లోనే కోర్సు సీట్లన్నీ నిండాయి. తొలి విడతలో 73,220 మంది విద్యార్థులకు డిగ్రీలో సీట్లు కేటాయించారు. అందులో అధికశాతం మంది కామర్స్వైపే మొగ్గు చూపారు. కామర్స్లో 33,251(45.41%), లైఫ్ సైన్సెస్లో 16,434 (22.44 %) మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. ఇప్పటివరకు అమ్మాయిలకు 44,113 సీట్లు, అబ్బాయిలకు 29,107 సీట్లు కేటాయించారు. ఒక్క విద్యార్థీ చేరని డిగ్రీ కాలేజీలు 63 ఉన్నాయి. మొత్తం 73,220 సీట్లు కేటాయించగా, అందులో 68,494 సీట్లు ఇంగ్లిష్ మీడియానికి చెందినవి.
శుక్రవారం నుంచి ఈ నెల 27 వరకు దోస్త్ రెండో విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మూడో విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూలై 1 నుంచి 5 వరకు నిర్వహిస్తారు. జూలై 1 నుంచి 6 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ఉంటుంది. జూలై 10న మూడో విడత సీట్ల కేటాయింపు నిర్వహిస్తారు. జూలై 17 నుంచి డిగ్రీ మొదటి విడత సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. నాన్ దోస్త్ కాలేజీల్లో కోర్సుల మార్పిడికి ఇక అవకాశం ఉండబోదని పేర్కొన్నారు.
విద్యార్థులు ప్రభుత్వ కాలేజీలపై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దోస్త్ మొదటి కౌన్సెలింగ్లో ఇది మరోసారి రుజువైంది. టాప్ 10 కాలేజీల్లో తొమ్మిది ప్రభుత్వ కాలేజీలే ఉండటం గమనార్హం.