TM-33 | హైదరాబాద్, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ‘సార్.. వచ్చే నెల నా బిడ్డ పెండ్లి ఉన్నది. పెండ్లి ఖర్చుల కోసం భూమి అమ్ముదామంటే నా పొలం పొరపాటున నిషేధిత జాబితాలో పడింది. దానిని మార్చాలని ఎప్పుడో మీసేవ నుంచి దరఖాస్తు ఇచ్చిన. మండలాఫీస్, కలెక్టరేట్, ఇప్పుడు సీసీఎల్ఏ.. ఇట్ల అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పని అయితలేదు’ రంగారెడ్డి జిల్లా నుంచి సీసీఎల్ఏకు వచ్చిన చెందిన ఓ రైతు ఆవేదన ఇది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలు మొదలు సీసీఎల్ఏ వరకు రోజూ వందల మంది బాధితులు తమ దరఖాస్తులు పరిష్కరించాలంటూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. సాఫ్ట్వేర్లో ఉన్న లోపాలు, అధికారుల తప్పిదం, డాటా ఎంట్రీ లోపాల వల్ల కొందరు రైతులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
పొరపాటున భూములు నిషేధిత జాబితాలో పడటం, పాస్బుక్లో తప్పులు, విస్తీర్ణం తక్కువగా నమోదవటం.. తదితర సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే గుర్తించింది. ఏడాదిన్నర కిందటే ‘టీఎం-33’ (ట్రాన్సాక్షన్ మాడ్యూల్) అందుబాటులోకి తెచ్చింది. భూములకు సంబంధించిన దాదాపు అన్ని రకాల సమస్యలకు ఈ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. మీసేవ ద్వారా దరఖాస్తు చేస్తే నేరుగా కలెక్టర్ లాగిన్కు వెళ్తుంది. కలెక్టర్ అధికారుల ద్వారా క్షేత్రస్థాయి విచారణ జరిపించి, నివేదిక తెప్పించుకొని, పరిశీలించి, మార్పులు చేర్పులు చేసేందుకు ఈ మాడ్యూల్ అవకాశం కల్పించింది. ఇలా ఇప్పటివరకు లక్షల దరఖాస్తులను అధికారులు డిస్పోజ్ చేశారు. అధికారులు కొన్నిరోజులుగా ఈ దరఖాస్తుల పరిష్కారాన్ని పూర్తిగా పక్కనబెట్టారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం టీఎం-33 దరఖాస్తుల పరిష్కారాన్ని నిలిపివేయాలని కలెక్టర్లను ఆదేశించినట్టు ప్రచారం ఉన్నది. ఈ నేపథ్యంలోనే దరఖాస్తులను పెండింగ్లో ఉంచినట్టు సమాచారం. దీంతో అత్యవసర పరిస్థితి ఉన్న రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వం వేసిన ధరణి కమిటీపై నివేదిక వచ్చే వరకు టీఎం-33 దరఖాస్తుల పరిష్కారాన్ని పక్కనబెట్టాలని సూచించినట్టు తెలిసింది. దీంతో కమిటీకి, తమకు సంబంధం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు మాత్రం దరఖాస్తులను ఆపాలని ఆదేశాలు ఇవ్వలేదని చెప్పడం గమనార్హం. దీంతో బాధితులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనుమానం ఉన్న దరఖాస్తులను పెండింగ్లో పెట్టాలని, పారదర్శకంగా ఉన్న వాటిని పరిష్కరిస్తే తమకు మేలు కలుగుతుందని కోరుతున్నారు.